పెప్పర్ స్ప్రేతో ఏం పొడిచారు... ఢిల్లీకి రైళ్లలో వెళ్లి ఏం అఘోరిస్తారు...?

శనివారం, 15 ఫిబ్రవరి 2014 (19:56 IST)
FILE
కిషన్ రెడ్డికి సీమాంధ్ర నాయకులు, ప్రజలు చేస్తున్న గోల చూసి తమ అధిష్టానం భాజపా అగ్రనేతల మనసు టి పట్ల ఎక్కడ మారిపోతుందో అని భయపడుతున్నట్టున్నారు. అందుకే ఇవాళ సీమాంధ్ర జిల్లాల నుంచి రైళ్లలో వెళ్లిన వారిని ఉద్దేశించి తెగ ఇదయిపోయారు.

పెప్పర్ స్ప్రేతో లగడపాటి రాజగోపాల్ పార్లమెంటులో ఏం పొడిచారు... బిల్లును ఏమయినా ఆపారా అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదండోయ్ ఇపుడు ప్రత్యేక రైళ్లేసుకుని ఢిల్లీకి పరుగులెత్తుతున్న ప్రజలు కూడా ఢిల్లీలో ఏం అఘోరిస్తారన్నట్లు సెటైర్లు వేసేస్తున్నారు.

పొరబాటున ఢిల్లీకి ఈ రైళ్లలో వెళ్లిన జనం రచ్చరచ్చ చేస్తే భాజపా ఎక్కడ రివర్స్ గేర్ తీసుకుంటుందో అని ఆయన బెంబేలెత్తిపోతున్నారు. అందుకే మొన్నామధ్య సుష్మాస్వరాజ్ ఏ దశలోనూ టి.బిల్లుపై ప్రభుత్వంతో మాట్లాడనని వ్యాఖ్యానిస్తే.... పనిమాలా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగుతో మీడియా ముందుకు వచ్చి అదేమీ కాదు... టి.కి కట్టుబడి ఉన్నామనీ, భయపడక్కర్లేదని చెప్పించి మరీ వెళ్లారు.

అంతేకాదండోయ్... సుష్మా చేత ట్వీట్లు కూడా ఇప్పించారు. ఇదంతా లగడపాటి పెప్పర్ దెబ్బన్న సంగతి ఆయనకు తెలుసు. మళ్లీ ఇప్పుడు సీమాంధ్ర నుంచి రైళ్లలో వచ్చే జనం ఏం చేస్తారోనన్న భయం ఆయనకు పట్టుకుంది. మొత్తానికి తెలంగాణ బిల్లు పితలాటకం వచ్చేవారంలో తేలిపోతుంది. మన జాతిని ముక్కలు చేసేందుకు దేశంలోని ఆయా పార్టీల నాయకులు తలో చెయ్యేస్తున్నారు మరి. ఏం ఖర్మ... మన నాయకులు... మన గొడవలు... ఢిల్లీ వీధుల్లో మన కొట్లాటలు... సిగ్గుసిగ్గు!!

వెబ్దునియా పై చదవండి