మైనర్ మహిళా బాక్సర్లకు ప్రెగ్నెన్సీ టెస్టులు నిర్వహించలేదు : సాయ్

శుక్రవారం, 7 నవంబరు 2014 (15:38 IST)
అవివాహిత మైనర్ మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయలేదని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పష్టం చేసింది. భారత తరపున ప్రాతినిథ్యం వహించే అవివాహిత మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వార్తలు రావడంతో పెద్ద దుమారం చెలరేగిన విషయం తెల్సిందే. 
 
దీనిపై సాయ్ వివరణ ఇచ్చింది. మైనర్ బాక్సర్లకు కూడా ప్రెగ్నెన్సీ టెస్టులు చేపట్టారన్న వార్తలు నిరాధారమని పేర్కొంది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో పాల్గొంటున్న భారత జట్టులో 18 ఏళ్ల లోపు బాక్సర్లెవరూ లేరని స్పష్టం చేసింది. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనేందుకు కనీస వయసే 19 ఏళ్లు అయినప్పుడు, జట్టులో మైనర్లెలా ఉంటారని సాయ్ డైరక్టర్ జనరల్ జిజి థామ్సన్ ప్రశ్నించారు. 
 
అదేసమయంలో వరల్డ్ ఈవెంట్‌లో పాల్గొనాలంటే ప్రెగ్నెన్సీ టెస్టు తప్పనిసరి అని ప్రపంచ బాక్సింగ్ సంఘం నిబంధన విధించడంతో భారత బాక్సింగ్ సంఘం మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. జట్టులో మైనర్లెవరూ లేరని థామ్సన్ స్పష్టం చేశారు. ప్రపంచ బాక్సింగ్ సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకున్నామని తెలిపారు. వరల్డ్ క్లాస్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనాలంటే మహిళా బాక్సర్లు 'నో ప్రెగ్నెన్సీ' సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి