నయన్ వైపు తెలుగు హీరోల చూపు.. సరసకు చేరుతుందా..?

సోమవారం, 4 మే 2015 (11:12 IST)
దక్షణాది సినీ పరిశ్రమలో అగ్రతారగా వెలుగుతున్న అందాల తార నయనతార. ఆ మధ్య ప్రేమలు, పెళ్లి అంటూ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న అమ్మడు మళ్లీ గాడిలో పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నది. యంగ్ హీరోలతో పోటీపడి మరి నటిస్తుంది నయనతార. అయితే అమ్మడు ఇటీవల అస్సలు టాలీవుడ్ ఇండస్ట్రీ వైపే చూడట్లేదు.
 
ప్రభు దేవాతో ప్రేమ, పెళ్లి ఫెయిల్ అయిన తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి వచ్చిన నయన తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ మధ్య గ్రీకువీరుడు, అనామిక సినిమాల్లో నటించింది. ఆ రెండు ప్లాఫ్ కావడంతో ఆ తర్వాత ఒక్క సినిమా కూడా నయన చేయలేదు. అయితే తాజాగా తెలుగు హీరోల చూపు నయనతారపై పడినట్లు సమాచారం. 
 
బాలకృష్ణ సరసన ''సింహ''లో నటించి అదరగొట్టిన ఈమెను బాలయ్య తదుపరి సినిమా ''డిక్టేటర్''లో తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే గతంలో ''లక్ష్మీ'' సినిమాతో నయనతారతో కలసి హిట్ అందుకున్న వెంకటేష్ కూడా తన తదుపరి సినిమాలో నయనతారనే కుదుర్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. 
 
ఇదేవిధంగా నయన తార కూడా టాలీవుడ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగులో అంతగా ఆకట్టుకోని నయనతార ఈసారి మాంచి హిట్ కొట్టాలని చూస్తున్నదట. అందులో భాగంగా యంగ్ హీరో గోపిచంద్‌తో నయనతార ఓ సినిమాలో చేస్తుందట. దీంతో తెలుగు ప్రేక్షకులు వెండితెరపై మళ్ళీ నయనతార అందాలని చూడొచ్చు అనమాట.

వెబ్దునియా పై చదవండి