బాలీవుడ్‌లో కరోనా కలకలం - వైరస్ బారినపడుతున్న సెలబ్రిటీలు.. బిగ్ బి ఆరోగ్యం ఎలావుంది?

ఆదివారం, 12 జులై 2020 (19:32 IST)
బాలీవుడ్ మూవీ ఇండ‌స్ట్రీలో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తుంది. ప‌లువురు సెల‌బ్రిటీలు లేదంటే వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది క‌రోనా బారిన ప‌డుతుండ‌టంతో అంద‌రిలో ఆందోళ‌న నెల‌కొంది. శనివారం రాత్రి అమితాబ్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌ల‌కి కరోనా పాజిటివ్ అని తేల‌గా, నటి రేఖ బంగళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒక‌రు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో ఆమె బంగళాను ముంబై మున్సిపల్ అధికారులు మూసివేశారు. అలాగే, అమితాబ్ కోడలు ఐశ్వర్యా రాయ్, మనుమరాలు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ త‌న త‌ల్లి, సోద‌రునితో పాటు మరో ఇద్ద‌రికి కరోనా సోకింద‌ని వెల్లడించారు.
 
అనుప‌మ్ ఖేర్ త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో షేర్ చేస్తూ.. త‌న త‌ల్లి దులారికి కొద్ది పాటి కరోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని పేర్కొన్నాడు. సోద‌రుడు, వ‌దిన‌, మేన‌కోడ‌లు కూడా క‌రోనా బారిన ప‌డ్డార‌ని స్ప‌ష్టంచేశాడు. గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న దులారికి ఆక‌లి లేద‌ట‌. నిద్ర కూడా సరిగా ప‌ట్ట‌క‌పోవ‌డంతో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో ఆమెకి కరోనా అని తేలింది. 
 
ప్ర‌స్తుతం  త‌న త‌ల్లి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండ‌గా, మిగ‌తా వారు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అనుప‌మ్ ఖేర్ ఫ్యామిలీలో న‌లుగురికి క‌రోనా అని తెలియ‌డంతో బీఎంసీ సిబ్బంది ఆయ‌న ఇంటిని శానిటైజ్ చేస్తుంది. అయితే త‌న ఫ్యామిలీని క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో అనుప‌మ్ కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఇందులో ఆయ‌నకి నెగెటివ్ అని తేలింది.
 
మరోవైపు, కరోనా వైరస్ బారినపడిన బాలీవుడ్ బిగ్ బి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే కాలేయ‌, ఉద‌ర సంబంధిత వ్యాధితో బాధ‌పడుతున్న అమితాబ్ బ‌చ్చ‌న్‌కి క‌రోనా సోకింద‌నే విష‌యం తెలుసుకున్న ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ్యం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వాక‌బు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 
 
అయితే అమితాబ్ చికిత్స‌కి సానుకూలంగా స్పందిస్తున్నారు. భ‌య‌ప‌డాల్సిందే ఏమి లేదు. రాత్రి ఆయ‌న  ప్ర‌శాంతంగా నిద్ర పోయార‌ని నానావ‌తి ఆసుప‌త్రికి చెందిన వైద్యుడు డాక్ట‌ర్ అన్సారీ పేర్కొన్నారు. అమితాబ్‌తో పాటు అభిషేక్ కూడా క‌రోనా బారిన ప‌డ‌డంతో వారిద్ద‌రు త్వ‌ర‌గా కోలుకోవాలని సినీ, రాజ‌కీయ, క్రీడా ప్ర‌ముఖులు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ఆకాంక్షిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు