దృష్టి లోపం కలిగినవారు యోగా చేయండి

Gulzar Ghouse

మంగళవారం, 24 మార్చి 2009 (15:28 IST)
భారతదేశంలో దాదాపు 6 కోట్ల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారు. ఇది అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకుకూడా చాలెంజ్‌గా మారింది. దృష్టి లోపంతో భాధపడేవారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. అలాగే వారు శారీరకంగాకూడా పరిశుభ్రతను పాటించాలి. ఇలాంటి వారు ఆటపాటలలో, పరుగుపందేలలో పాల్గొనలేక పోతుంటారు. కాబట్టి ఇలాంటివారు యోగాసనాలు చేస్తే ఆరోగ్యంగానే కాకుండా మానసికంగాకూడా దృఢంగానే ఉంటారని యోగా నిపుణులు అంటున్నారు.

దృష్టిలోపంతో బాధపడేవారికి యోగాసనాలు చేయడం ఏమంత కఠినం కాదు. యోగాసనాలు చేస్తే వారికి చాలా లాభాలుంటాయి. దాదాపుగా దృష్టిలోపంతో బాధపడేవారు తమ పనులను చాలావరకు మనోయోగంతో చేస్తుంటారు. దీంతో యోగాసనాలు ప్రారంభించిన రెండు-మూడు రోజులలోనే వారిలో నూతనోత్తేజం పుట్టుకొస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రాణాయామం, ధ్యానం వారికి సహజసిద్ధంగానే అలవడుతాయంటున్నారు.

దృష్టిలోపంతో బాధపడేవారికి ఎలాంటి ఆసనాన్నైనా చేసి చూపాల్సిన అవసరంలేదు. దీనికి బ్రెయిలీ లిపిలో చిత్రాలతోబాటు అక్షర రూపంకూడా ఇచ్చి ఉన్నారు. ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. దృష్టిలోపంతో బాధపడేవారు ఈత కొట్టడం, పరుగులు పెట్టడం, నడవడంలాంటి వ్యాయామాలు చేయలేరు.

కాబట్టి వారు శారీరకంగా, మానసికంగాకూడా బాగా నలిగిపోతుంటారు. అలాగే వారికి జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణలలో చాలా మార్పులు సంభవిస్తుంటాయి. దీంతో కేవలం దృష్టిలోపం కారణంగా మరిన్ని జబ్బులకు గురౌతుంటారు. ఇలాంటి వారికి యోగాసనాలు ఓ వరం లాంటిదంటున్నారు యోగా నిపుణులు. శరీరంలోని అన్ని భాగాలుకూడా యోగావలన సక్రమంగా పని చేస్తాయి.

దృష్టిలోపంతో బాధపడేవారు చేయవలసిన యోగాసనాలు : దృష్టిలోపంతో బాధపడేవారు ముఖ్యంగా తాడాసనం, త్రికోణాసనం, హస్తపాదాసనం, ఉత్కరాసనం, అగ్నిసార క్రియాసనం, భుజంగాసనం, మెడను చుట్టటం, బ్రహ్మముద్రాసనం,మార్జరాసనం, శశకాసనం, యోగముద్రాసనం, శలభాసనం, ధనురాసనం, సర్వాంగాసనం, భ్రమరీ ప్రాణాయామంలు కూడా చేయవచ్చని యోగానిపుణులు పేర్కొన్నారు.

వీరు ధ్యానం చేయడంవలన వారి మనసులో ఉదాసీనతా భావాన్ని తగ్గించవచ్చు. దీంతో వారిలో కార్యదక్షతను పెంపొందించుకోవచ్చు. అతి కొద్దికాలంలోనే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమం తప్పకుండా యోగాసనాలు చేస్తుంటే వారిలో జీర్ణక్రియ బాగా జరిగి ఆకలి నియంత్రణలో ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగాకూడా వారి శరీరంలో మార్పులు వస్తాయంటున్నారు యోగా గురువులు.

దృష్టిలోపంతో బాధపడేవారు నడిచేటప్పుడుకూడా వారి మెడను, నడుమును చక్కగా ఉంచి స్థిరంగా నడుస్తారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నట్లు మనం గమనించవచ్చంటున్నారు యోగా ప్రముఖులు.

దృష్టిలోపంతో బాధపడేవారికి ప్రత్యేక పాఠశాలలుండాలి : ముఖ్యంగా మన దేశంలో దృష్టిలోపంతో బాధపడేవారికి ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించాలి. అలాగే వారికి క్రమం తప్పకుండా యోగాభ్యాసంకూడా నేర్పంచి వారిచేత ప్రతిరోజూ చేయిస్తూ ఉండాలి.

దృష్టిలోపంతో బాధపడేవారికి యోగాభ్యాసాలు ప్రత్యేకంగా కష్టమేమీకాదు. వారు తమ పనులను మనోయోగంతో చేస్తుంటారు కాబట్టి కేవలం రెండు-మూడు రోజులలోనే యోగాభ్యాసం చేయడం వలన వారిలో నూతనోత్సాహం ఏర్పడుతుంది. ఆసనాలు వేయడం, ప్రణాయామం చేయడం అలాగే ధ్యానం చేయడం వారికి సహజ సిద్ధంగా అలవడుతాయంటున్నారు యోగాగురువులు.

దృష్టిలోపంతో బాధపడేవారికి ప్రత్యేకంగా పాఠశాలలో ఏర్పాటు చేసి, వాటిలో పై ఆసనాలకు సంబంధించి ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇప్పించాలి. అలాగే వారి పాఠ్యప్రణాళికలలోకూడా యోగాకు సంబంధించిన అంశాలను జోడించాలి. దేశంలోని ప్రతి రాష్ట్రంలోకూడా ఇలాంటి పాఠశాలలను ఏర్పాటు చేయాలంటున్నారు యోగా గురువులు.

వెబ్దునియా పై చదవండి