బంగ్లాదేశ్లో అత్యున్నత పురస్కారమైన "బంగ్లాదేశ్ స్వాధీనతా సన్మానోనా"ను భారత ప్రధాని దివంగత ఇందిరా గాంధీకి ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. 1971 నాటి బంగ్లా విముక్తి యుద్ధంలో అందించిన సహకారం, సేవలకు గుర్తింపుగా దీన్ని ఇవ్వాలని ఆ దేశ కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని బంగ్లా ప్రధాని షేక్ హసీనా మీడియా కార్యదర్శి అబ్దుల్ కలామ్ ఆజాద్ మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ఈ పురస్కారాన్ని పొందిన తొలి వ్యక్తి ఇందిర కానున్నారని చెప్పారు.
ఈ నెల 25వ తేదీన దేశ రాజధాని ఢాకాలో జరిగే ఒక కార్యక్రమంలో బంగ్లా అధ్యక్షుడు జిల్లూర్ రెహ్మాన్ ఈ అవార్డును కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ఇందిరా గాంధీ కోడలు సోనియా గాంధీకి అందజేస్తారు. దేశ స్వాతంత్య్రోద్యమానికి అండగా నిలిచిన 47 మంది విదేశీయులను, ఐదు అంతర్జాతీయ సంస్థలను కూడా "ముక్తిజుద్ధో సన్మానోనా", ముక్తిజుద్ధో మైత్రీ సన్మానోనా అవార్డులతో సత్కరించాలని కేబినెట్ నిర్ణయించిందని ఆజాద్ తెలిపారు.