వామపక్ష పాలిత రాష్ట్రమైన పశ్చిమబెంగాల్లో రాజకీయ హింస పట్ల కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హింసకు అడ్డుకట్ట వేయాల్సిందేనని బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు చిదంబరం తేల్చి చెప్పారు.
బుధవారం న్యూఢిల్లో చిదంబరం-భట్టాచార్యల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా చిదంబరం తన మనస్సులోని మాటను బుద్ధదేవ్కు నిర్మొహమాటంగా వెల్లడించారు. వామపక్ష పార్టీలకు చెందిన సాయుధ బలగాలు శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఈ చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని ఆయన నొక్కివక్కాణించారు.
గత కొన్ని రోజులుగా బెంగాల్లో సీపీఎం కార్యకర్తలు రెచ్చిపోతున్న విషయం తెల్సిందే. తమకు ఎదురుతిరిగిన గ్రామస్తులను నిర్ధాక్షిణ్యంగా కాల్చివేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరి భేటీకి అధిక ప్రాధాన్యత ఏర్పడింది.
చిదంబరం ఆహ్వానం మేరకు నార్త్బ్లాక్లోని హోంశాఖ కార్యాలయానికి చేరుకున్న బుద్ధదేవ్... రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. ముఖ్యంగా ఈ నెల 7న నేతాయ్ ప్రాంతంలో సీపీఎం కార్యకర్తల కాల్పుల్లో ఏడుగురు మృతి చెందిన ఘటనపై వారివురూ చర్చించారు.