సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను ముక్కలై చెత్తలోకి చేరిపోతుంది : చంద్రబాబు

ఠాగూర్

ఆదివారం, 31 మార్చి 2024 (14:34 IST)
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను ముక్కలై చెత్తలోకి చేరిపోవడం ఖాయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తన ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆయన ఆదివారం ఎమ్మిగనూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమన్నారు. 
 
'నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్‌. భారతీయ జనతా పార్టీతో తాత్కాలిక పొత్తు అంటూ నా పేరుతో లేఖ రాసి సోషల్‌మీడియాలో వైకాపా దుష్ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ డీఎన్ఏలోనే బీసీ ఉంది. మాది పేదల పక్షం.. మీతోనే ఉంటాం. వైకాపాలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారు. అది భూస్వాములు, పెత్తందారుల పార్టీ.
 
వైకాపా హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తాం. రాయలసీమ ద్రోహి జగన్‌కు ఒక్క ఓటు కూడా వేయవద్దు. ఆయనకు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు. 
 
సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్‌. అన్ని వర్గాల పేదలను పైకి తీసుకొచ్చిన పార్టీ తెదేపా. వెనుకబడిన వర్గాలకు రూ.1.5 లక్షల కోట్లతో సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేస్తాం. చట్టపరంగా కులగణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తాం. కురబలను ఎస్సీ, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తాం. ఎమ్మిగనూరుకు టెక్స్‌టైల్‌ పార్కు తీసుకువస్తాం' అని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు