మూడు రాజధానుల బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర

శుక్రవారం, 31 జులై 2020 (16:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. అంతేకాదు.. సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా ఆయన ఆమోదించారు. 
 
దీంతో.. ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ఇక నుంచి శాసన రాజధానిగా మారనుంది. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు మారనున్నాయి. వికేంద్రీకరణ బిల్లును 3 వారాల క్రితం జగన్ సర్కార్ గవర్నర్‌కు పంపింది. ఇప్పుడు.. గవర్నర్ ఆమోదించడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్టయింది. 
 
కాగా, జనవరి 20వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనమండలిలో ఈ బిల్లులు తొలుత పాస్ కాలేదు. ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. దీంతో, జూన్ 16వ తేదీన రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసి, ఆ తర్వాత, శాసన మండలికి పంపింది. 
 
అనంతరం నెల రోజుల తర్వాత బిల్లు ఆటోమేటిక్‌‌ పాస్ అయినట్టుగా భావించి, గవర్నర్ ఆమోదానికి పంపారు. ఈ నేపథ్యంలో, ఈ బిల్లులపై న్యాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఏపీకి మూడు రాజధానులు ఏర్పడనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు