విశాఖలో తగ్గిన కరోనా కేసులు... దేశంలో నాలుగోస్థానంలో ఆంధ్రప్రదేశ్

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (13:49 IST)
అందమైన సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో మొత్తం 20 కేసులు నమోదు కాగా, వీటిలో 10 కేసులు యాక్టివ్ కేసులు. ప్రస్తుత ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. 
 
ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున విశాఖలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖలో కరోనా విస్తరణ తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఏది ఏమైనా ఈ కరోనా మహమ్మారిని అందరం కలసికట్టుగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని గుర్తు చేశారు. 
 
ఇలాంటి క్లిష్ట సమయంలోనే కరోనా బాధితులకు అండగా నిలబడాలని ఆదేశించారని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ల ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తం కొరత లేకుండా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విన్నవించారు.
 
మరోవైపు, కరోనా వైరస్‌ పరీక్షల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.  ప్రతి పది లక్షల మందికి సగటున చేస్తున్న పరీక్షల్లో ముందంజలో ఉంది. దేశంలో సగటున 10 లక్షల మందికి 198 పరీక్షలు చేస్తుంటే.. ఏపీలో 331 టెస్టులు చేస్తున్నారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో రోజుకు 3వేలకు పైగా పరీక్షలు చేస్తున్నారని, ఇప్పటివరకు మొత్తంగా 16,550 మందికి పరీక్షలు నిర్వహించారని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు