ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ - అధినేత ఎవరంటే?

సోమవారం, 19 జూన్ 2023 (10:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమలో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఈ పార్టీని స్థాపించనున్నారు. ఇదేవిషయంపై ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి రాజకీయ గ్రహణం పట్టింది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఏదో ఒక వర్గానికి కొమ్ముకాస్తూ మిగిలిన వర్గాలను వెనుకబాటుతనానికి గురిచేస్తున్నారని అన్నారు.
 
అన్నదాతలు వ్యవసాయాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. నైపుణ్యం కలిగిన రాష్ట్ర యువత ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చూపిస్తుంటే.. మన రాష్ట్రంలో ఉపాధి లేక అల్లాడుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ పూర్తిగా ఆణచివేస్తున్నారన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసి కనుమరుగైందని, తెదేపా రాష్ట్రానికి చేసిందేమీ లేదని, కొన్ని కుటుంబాలే లాభపడ్డాయని అన్నారు. వైకాపా ఆవిర్భావం, జగన్ అధికారంలోకి రావడం రాష్ట్ర చరిత్రలో రెండు దురదృష్టకర ఘటనలని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తాత్కాలిక రాజధానితో కాలయాపన చేస్తే, ప్రస్తుత సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 
 
ఈ పరిస్థితుల్లో మెజారిటీ ప్రజల సంకల్పాన్ని ప్రతిబింభిస్తూ కొత్త పార్టీ ఆవిర్భవిస్తోందన్నారు. వచ్చేనెల 23న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ప్రజాచైతన్య వేదికపై నిర్వహించే 'ప్రజా సింహగర్జన' బహిరంగ సభలో పార్టీ ఆవిర్భవిస్తుందని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు