చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

గురువారం, 2 నవంబరు 2023 (19:24 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై నాలుగు కేసులు నమోదు చేయగా, తాజాగా నమోదు చేసిన కేసుతో కలిసి చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల సంఖ్య ఐదుకు చేరింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని ఏపీ ఎండీసీ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. 
 
ఇందులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమామహేశ్వర రావు పేర్లను చేర్చారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏపీఎండీసీ చేసిన ఫిర్యాదును సీఐడీ స్వీకరించింది. ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఇది ఐదో కేసు కావడం గమనార్హం. 
 
కాగా, చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం అనుమతుల మంజూరు కేసులను నమోదు చేసిన విషయం తెల్సిందే. వీటిలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా, మొత్తం 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఆయన బుధవారం విడుదలైన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు