స్థానిక ఎన్నికలు వాయిదా.. లాక్డౌన్ పొడగించాలని కోరిన సీఎం జగన్!!

సోమవారం, 11 మే 2020 (18:29 IST)
కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ వాయిదా వేశారు. అలాగే, ఎన్నికల ప్రచారాన్ని కూడా వాయిదావేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి తగ్గింది. ఇదిలావుంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న మూడో దశ లాక్‌డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకుంటారు.
 
ఇందులోభాగంగా, ప్రధాని మోడీ సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్రం సూచనలకు అనుగుణంగా రెండు నెలల నుంచి చర్యలు తీసుకున్నామని, కరోనాను నియంత్రించగలిగామని ప్రధానికి వివరించినట్టు సమాచారం. 
 
ఏపీలో మూడు సార్లు సమగ్ర సర్వే నిర్వహించామని, 30 వేల మందిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో వారందరికీ పరీక్షలు నిర్వహించామని చెప్పినట్టు సమాచారం. సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాలని, ‘కరోనా’ను నియంత్రించలేకపోతే ముందుకు వెళ్లలేమని జగన్ చెప్పినట్టు సమాచారం.
 
'కరోనా' లక్షణాలు ఉన్న వ్యక్తులను సమాజం వేరుగా చూస్తోందన్న భావన వస్తోందని, అందుకే, ఈ లక్షాణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదన్న విషయాన్ని మోడీ దృష్టికి జగన్ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అదేసమయంలో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందువల్ల లాక్డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించాలని సీఎం జగన్ కోరినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు