పోలవరం ప్రాజెక్టు వద్ద 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం : సీఎం జగన్

బుధవారం, 2 డిశెంబరు 2020 (18:19 IST)
పోలవరం ప్రాజెక్టు వద్ద వంద అడుగుల ఎత్తులో దివంగత మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, బుధవారం పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. 
 
ప్రభుత్వ తీరు వల్ల పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమన్నారు. డ్యామ్ ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గంచబోమని తేల్చి చెప్పారు. 
 
దివంగత వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు నిర్మిస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిర్ణీత సమయానికి పోలవరంను పూర్తి చేసి, అక్కడ 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
 
మరోవైపు గత టీడీపీ ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైనా జగన్ విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. చంద్రన్న భజన కోసం ఏకంగా రూ.83 కోట్లను ఖర్చు చేశారని విమర్శించారు.
 
ఇదేసమయంలో గతంలో పోలవరం సందర్శనకు వచ్చిన టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ భజన పాట పాడిన వీడియోను శాసనసభలో ప్లే చేశారు. ఈ వీడియో చూస్తూ జగన్ పడిపడి నవ్వారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో చంద్రబాబు భజన చేయించుకున్నారని చెప్పారు. 
 
అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంతో పోలవరం ప్రాజెక్టుకు అనేక సమస్యలు వస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తనపై ఉన్న కేసుల భయంతో నిధుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారని అన్నారు.
 
ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన మాటలు విని వైసీపీకి 22 మంది ఎంపీలను, 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు కట్టబెట్టారని... ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకపోతే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 
 
పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని ఒప్పించకపోతే ప్రజల దృష్టిలో చరిత్రహీనులుగా నిలిచిపోతారని అన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రంపై  పోరాడతాం, అన్నీ సాధిస్తామని చెప్పి, ఇప్పుడు డ్రామాలు ఆడొద్దని అన్నారు.
 
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. కేంద్రానికి భయపడే వ్యక్తి జగన్ కాదని అన్నారు. సోనియాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెను ఎదిరించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని గుర్తుచేశారు. 2021 డిసెంబరుకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు