ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (07:29 IST)
ఎపిలో పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

ఇటీవల ఏపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపధ్యంలో పోలీసులు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొంత మందిని తీసుకెళ్లి అకారణంగా హింసిస్తున్నారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో హెబియస్ కార్పస్‌ పిటిషన్ వేసి కోర్టులను ఆశ్రయిస్తున్నారు బాధిత కుటుంబాలు.

ఇక ఈ నేపధ్యంలోనే హైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం ఏపీ పోలీసులకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. గుంటూరులో ముగ్గురు యువకులు అదృశ్యం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అదృశ్యం అయిన వారిని పోలీసులే తీసుకెళ్లారని వారి బంధువులు ఆరోపించారు. 

వాళ్లంతా ఇంట్లో ఉన్నప్పుడే మఫ్టీలో ఉన్న పోలీసులు దాడి చేసి తీసుకెళ్లారని అరెస్ట్ చూపించకుండా చిత్ర హింసలకు గురి చేశారని పేర్కొన్నారు . 15 రోజులైనా పోలీసులు ఏమీ చెప్పకపోవడంతో హైకోర్టులో హెబియస్ కార్పస్‌ పిటిషన్ వేశారు కుటుంబ సభ్యులు.
 
ఇక ఆ తర్వాత వారు క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొన్నారని కేసులు నమోదు చేశారు. ఇక ముగ్గురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చూపించకుండా చిత్రహింసలు పెట్టటంపై హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది.

పోలీసుల విచారణ నివేదిక.. జ్యూడియల్ నివేదిక కూడా తేడాగా ఉండటంతో అసలు విషయం రాబట్టేందుకు సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది.
 
గుంటూరు అర్బన్ ఎస్పీపై పీహెచ్‌డీ రామకృష్ణపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించటం ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక న్యాయవిచారణకు పోలీసులు సరిగా స్పందించకపోవడంతోనే హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.

ఇక ఇలాంటి వ్యవహారంలోనే ఏకంగా డీజీపీ సైతం కోర్టు ముందు చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. ఈ తరహా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన షాక్ ఏపీ పోలీసులకు టెన్షన్ పుట్టిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు