పూర్వం మాదిరిగా తప్పించుకునే పరిస్థితి లేదు.. ఎండార్స్ చేసినా కేసు పెడుతున్నారు.. మంత్రి ధర్మాన

సోమవారం, 2 అక్టోబరు 2023 (13:19 IST)
రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి ధర్మాన ప్రసాద రావు హెచ్చరిక చేశారు. పూర్వం మాదిరిగా తప్పించుకునే పరిస్థితి లేదని, అందువల్ల ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా, ఎండార్స్ చేసినా కేసులు పెట్టే పరిస్థితి ఉందన్నారు. డిజిటలైజేషన్‌ విస్తృతమైన నేపథ్యంలో తప్పులు చేస్తే వెంటనే దొరికిపోయే అవకాశం ఉందని, మంత్రిగా ఉన్నప్పుడు నేను సింపుల్‌గా ఎండార్స్‌ చేస్తే సీబీఐ కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు.
 
ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌ సమావేశం విజయవాడలో ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘భూముల సమస్యల పరిష్కారంలో ఉద్యోగులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. కొందరు రకరకాల వాదనలు చేస్తారు. నిబంధనలు వివరించి సున్నితంగా వాటిని తిరస్కరించే విధానాన్ని అలవర్చుకోవాలి. చిన్నచిన్న అపోహలు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య ఉంటాయి. 
 
ఉద్యోగులు ప్రతి విషయంపై అప్‌డేట్‌ కాకుండా ఉంటే అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూశాఖ పేరును ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అని పేరు పెట్టడంపై సీఎం జగన్‌తో త్వరలోనే చర్చిస్తా. 'టైటిల్‌ యాక్ట్‌' త్వరలోనే రాష్ట్రంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గడిచిన నాలుగు సంవత్సరాల్లో రెవెన్యూ శాఖలో ముఖ్యమైన సంస్కరణలు అమల్లోనికి తెచ్చాం. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తాం' అని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు