అర్థరాత్రి చడీచప్పుడు లేకుండా పారిపోయిన వధువు.. ప్రియుడితో పెళ్లి.. ఠాణాలో ప్రత్యక్షం

సోమవారం, 15 నవంబరు 2021 (10:57 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఏ వధువు పెళ్లి మండపం నుంచి పారిపోయింది. ఆ తర్వాత తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆ వెంటనే తమకు రక్షణ కల్పించాలంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదనపల్లెకు చెందిన యువకుడికి, అదే మండలానికి చెందిన యువతికి ఆదివారం తెల్లవారుజామున పెళ్లి జరగాల్సి ఉంది. శనివారమే వధూవరుల కుటుంబాలు కల్యాణ మండపానికి చేరుకున్నాయి. 
 
అయితే, అర్థరాత్రి వేళ చడీచప్పుడు కాకుండా వధువు వెళ్లిపోయింది. తెల్లవారుజామున ఆమె లేదన్న విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
 
కల్యాణ మండపం నుంచి వెళ్లిపోయిన వధువు ప్రియుడిని పెళ్లాడి నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న వధూవరుల కుటుంబాలు ప్రియుడితో వచ్చిన ఆమెను చూసి షాకయ్యాయి. 
 
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. యువతి మేజర్ కాబట్టి ఆమె ఇష్టప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని ఇరు కుటుంబాల వారికి నచ్చజెప్పారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఈ నెల 3న డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి తన తల్లిదండ్రులతో మాట్లాడారని చెప్పింది. 
 
అప్పుడేమో బలవంతపు పెళ్లి చేయమని పోలీసులతో చెప్పిన తల్లిదండ్రులు ఆ తర్వాత ఇంట్లో బంధించి పెళ్లికి ఏర్పాట్లు చేశారని, అందుకనే వెళ్లిపోయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తమకు రక్షణ కల్పించాలని కోరడంతో పోలీసులు కూడా ఆ నవదంపతులకు రక్షణ కల్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు