వైఎస్‌ వివేకా హత్య కేసు.. రంగంలోకి దిగిన సీబీఐ.. అసలైన నిందితుని కోసం..?

ఆదివారం, 19 జులై 2020 (16:48 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో 16 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ గతంలో వేసిన సిట్ ఏమీ తేల్చలేదు. దీంతో కోర్టు ఆదేశాలతో కడప చేరుకున్న సీబీఐ అధికారులు.. రంగంలోకి దిగారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడుగురు సభ్యుల బృదం కడప జిల్లాకు చేరుకుంది. ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్‌తో సమావేశమై కేసుపై చర్చించారు. 
 
కడప, పులివెందులలో సీబీఐ అధికారులు వారం రోజులపాటు మకాం వేయనున్నారు. అటు వివేకా హత్యకేసు విచారణ అధికారి డిఎస్పీ వాసుదేవన్‌ను కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారు. హత్య కేసుకు సంబంధించిన డాక్యూమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
హత్య జరిగిన వివేకా ఇంటిని కూడా సీబీఐ అధికారులు పరిశీలిస్తారు. సిట్‌లో భాగంగా విచారణ జరిపిన అధికారులను కూడా వేర్వేరుగా విచారించనున్నారు. వివేకా హత్యకు గురైన పులివెందులలోని ఇంటిని సీబీఐ అధికారులు ఆదివారం పరిశీలించారు. అక్కడ కీలక సోదాలు నిర్వహించిన అనంతరం.. సీబీఐ బృందం పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. 
 
కాగా.. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, వైఎస్ కుటుంబంలో ముఖ్యుడైన వైఎస్ వివేకానంద రెడ్డి గత ఏడాది మార్చి 15న పులివెందులలోని తన సొంతింట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించగా, మొత్తం 1,300 మంది అనుమానితులను గుర్తించినా, అసలైన నిందితులు ఎవరేది మాత్రం తేల్చలేదు. 
 
ఏపీ సర్కారు దర్యాప్తు చేయిస్తోన్న తీరుపై వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు