సోనూ సూద్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. ప్రపంచం మారాలంటే... బాబు ప్రశంస

బుధవారం, 30 సెప్టెంబరు 2020 (11:14 IST)
కరోనా లాక్డౌన్ కష్టాల్లో అనేక మందికి ఆపన్న హస్తం అందించిన రియల్ హీరో సోనూ సూద్. ఈయన ప్రతిష్టాత్మక ఎస్డీజీ స్పెషల్ హ్యూమానిటేరియన్ అవార్డు వరించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) కింద దీన్ని ప్రదానం చేస్తారు. 
 
సోనూ సూద్‌కు ఈ అవార్డు దక్కడంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, రియల్ హీరోపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, 'మరింత మెరgగైన ప్రపంచానికి మీ వంటి వారి అవసరం ఎంతైనా ఉంది' అని వ్యాఖ్యానించారు. 
 
దేశంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా, కేంద్రం ఉన్నఫళంగా లాక్డౌన్ ప్రకటించింది. ఆ సమయంలో తన ఔదార్యంతో ఎంతో మందికి సహాయం చేసి, తాను వెండితెరపై మాత్రమే ప్రతి నాయకుడినని, నిజ జీవితంలో నాయకుడినేనని నిరూపించుకున్నారు. ముఖ్యంగా, ఎంతో మంది వలస కార్మికులు తమతమ స్వస్థలాలకు వెళ్లేందుకు సోనూ సూద్ సాయం చేశారు. వారి కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లతో పాటు విమానాలను కూడా బుక్ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు