జైలు నుంచి చంద్రబాబు విడుదల.. దేవాన్ష్‌ను ముద్దాడిన తాత

మంగళవారం, 31 అక్టోబరు 2023 (17:19 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన జైలు నుంచి బయటకురాగానే తన మనవడు దేవాన్ష్‌ను ముద్దాడారు. ఆ తర్వాత పార్టీ నేతలకు కరచాలనం చేశారు. తమ వియ్యంకుడు, సినీ హీరో బాలకృష్ణ మాత్రం తన బావ చంద్రబాబు పాదాభివందనం చేశారు. అలాగే, చంద్రబాబును టీడీపీ సీనియర్ నేతలు ఆలింగనం చేసుకున్నారు. అలాగే చంద్రబాబును చూసేందుకు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
 
ఇదిలావుంటే, తన భర్త జైలు నుంచి విడుదల కావడంపై ఆయన భార్య నారా భువనేశ్వరి స్పందించారు. "చంద్రబాబు గారి అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన... తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా గడిచింది. అయితే ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చింది. సత్యం యొక్క బలం ఎంతో చూపించింది. ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో, రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి.
 
'నిజం గెలవాలి' అనే పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి సోదరుడికి, ప్రతి మహిళకు, ప్రతి పౌరుడికి శిరసు వంచి కృతజ్ఞతలు చెపుతున్నా. నా భర్త అరెస్టుతో 53 రోజులుగా ఇక్కడే బస చేసిన నన్ను మీ ఇంటి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ దేవుడి దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకుంటూ...." అని నారా భువనేశ్వరి తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు