చంద్రబాబును ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి పంపించాలి: మంత్రి కొడాలి నాని

శుక్రవారం, 20 నవంబరు 2020 (11:08 IST)
గత ఎన్నికల్లో వైయస్ జగన్ ఇచ్చిన షాక్, కరోనా కారణంగా ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితితో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నాని విమర్శించారు.

ఓటమితో పదహారు నెలల నుంచి ఖాళీగా, వంటరిగా వుంటూ, ఎవరో ఇచ్చిన పనికిమాలిన సమాచారంతో సీఎం జగన్ మీద నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మా ప్రభుత్వం ఇసుక ను కొందరికి దోచిపెడుతోందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబులాగా బినామీలకు ఇసుకను దోచిపెట్టాలంటే... వారి హయాంలో చేసినట్లు ఉచిత ఇసుక పాలసీనే మేము కూడా అమలు చేసేవారిమని అన్నారు.

డ్వాక్రా గ్రూపుల పేరుతో ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు ఆయన అనుయాయులు ఏ రకంగా దోచుకున్నారో అందరికీ తెలుసునని అన్నారు. రాష్ట్రంలో ఏ డ్వాక్రా మహిళా కూడా రీచ్ నుంచి ఇసుకను తీసి, విక్రయించలేదని, చంద్రబాబు, ఆయన అనుచరులే ఇసుక దందా చేశారని అన్నారు. చివరికి టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లనివ్వడం లేదని మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టి కొట్టారని గుర్తు చేశారు.

వీరి అవినీతి వల్ల ఎన్‌జిటి రూ.వందకోట్లు జరిమానా విధించిందని అన్నారు. ఈ పరస్థితిని చక్కదిద్దుతూ జగన్ ప్రభుత్వానికి ఆదాయం రావాలని, ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరగకూడదనే మంచి ఉద్దేశంతో ఇసుక పాలసీని తీసుకువచ్చారని అన్నారు.

ఏ ప్రాంతంలో ఎంత ఇసుక అవసరం, రీచ్‌ ల నుంచి వినియోగదారులకు సులభంగా దానిని ఎలా అందించాలనే ఉద్దేశంతో మెరుగైన ఇసుక పాలనీని తీసువస్తుంటే... చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు. చంద్రబాబు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, జగన్ మీద ఏదో ఒక రకంగా నిందలు వేయాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు.

చంద్రబాబు చెబుతున్న శేఖర్‌రెడ్డి ఆయన మిత్రుడేనని, ఎపికి తీసుకువచ్చిందే చంద్రబాబు అని అన్నారు. భారతదేశంలోనే పేదల కోసం వేల కోట్ల రూపాయలను అందిస్తున్న మహానుభావుడు వైయస్ జగన్ అని అన్నారు. ఆయనను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు.

చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్‌ తొత్తులా నిమ్మగడ్డ
ఎన్నికల కమిషన్ పై తమకు గౌరవం వుందని, కానీ రాజ్యాంగబద్దమైన పదవిలో వుంటూ ప్రతిపక్షనేత చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహరిస్తున్న తీరును సమర్థించలేమని  అన్నారు. తాను రాజ్యాంగ వ్యవస్థలో వున్నానని, తాను ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.

చంద్రబాబు తన హయాంలో మరో రెండుమూడు నెలల్లో రిటైర్డ్ అయ్యే సమయంలో తన ముసుగుగా నిమ్మగడ్డ రమేష్ ను ఎన్నికల కమిషన్ చీఫ్ గా నియమించారని అన్నారు. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్‌ సదరు ముసుగును కూడా తీసేసి చంద్రబాబు కోసం పనిచేస్తూ, ఆయన చెప్పినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

రాజ్యాంగబద్దమైన పదవిలో వున్న ఆయన ఎవరిని అడిగి ఎన్నికలను వాయిదా వేశారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని సంప్రదించకుండా, చంద్రబాబు చెప్పాడని ఎన్నికలను వాయిదా వేశాడని విమర్శించారు. ముఖ్యమంత్రిని ఫ్యాక్షనిస్ట్ అంటూ ఎలా మాట్లాడతారని నిలదీశారు.

తనకు ప్రాణహాని వుందని, కేంద్ర భద్రత కావాలని కోరడం ద్వారా రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ఈ ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ కించపరిచారని అన్నారు. తన వ్యవహారశైలితో రాజ్యాంగబద్దమైన పదవికే నిమ్మగడ్డ మచ్చ తెస్తున్నారని, ఇప్పటికైనా తాను రాజీనామా చేసి ఆ పదవికి వున్న గౌరవాన్ని కాపాడాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు