పోలీసులకు అండగా ప్రతిభా ఛారిటీస్, తెలుగుదేశం నేత కాట్రగడ్డ బాబు

మంగళవారం, 5 మే 2020 (15:54 IST)
కరోనా మహమ్మారి కట్టడిలో తమదైన శైలిలో సేవలు అందిస్తున్న పోలీసు శాఖకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలుగుదేశం నేత కాట్రగడ్డ బాబు అన్నారు. ఇప్పటికే పోలీసు సంక్షేమ నిధికి లక్ష రూపాయలను అందించిన కాట్రగడ్డ, మంగళవారం మరోరీతిన సేవా కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. విజయవాడ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని నున్న పోలీసులకు బలవర్ధక ఆహారంతో కూడిన ప్రత్యేక కిట్ ను అందించారు. 
 
చెక్కీ, నువ్వుల లడ్డు, ప్రోటీన్ పౌడర్‌తో ఒక్కొక్కటి రూ.600 విలువైన 125 ప్యాకెట్లను చిరుకానుకగా నున్న పోలీసు స్టేషన్‌కు అందించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రభాకర్ సమక్షంలో కాట్రగడ్డ వీటిని పోలీసు సిబ్బందికి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ తమ శాఖకు ఈ తరహా సహకారం అందించటం ముదావహమన్నారు. 
 
కాట్రగడ్డ బాబు మాట్లాడుతూ డిజిపి గౌతం సవాంగ్, నగర పోలీసు కమీషనర్ ద్వారకా తిరుమల రావుల మార్గనిర్దేశకత్వంలో తాము నూతనంగా ప్రారంభించిన ప్రతిభ ఛారిటీస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. కార్యక్రమంలో భాగంగా పోలీస్ వీరులకు జేజేలు పేరిట రూపొందించిన కరపత్రాన్ని సైతం ఆవిష్కరించారు. 
 
ప్రతిభ ఆఫ్‌సెట్ ప్రింటింగ్ ప్రెస్ తరుపున దీనిని రూపొందించారు. కార్యక్రమంలో రోటేరియన్ రవి ప్రసాద్, కె. సాయిసూర్య తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు