కరోనా వస్తుంది.. పోతోంది... అందువల్ల సహజీవనం తప్పదు : సీఎం జగన్

మంగళవారం, 28 జులై 2020 (14:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'కరోనా మహమ్మారి వస్తుంది.. పోతుంది. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు కరోనాతో సహజీవనం చేయాల్సిందే' అని ఆయన చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, కరోనాను అరికట్టేందుకు రాష్ట్రంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ప్రతి అధికారి సీరియస్‌గా పనిచేస్తున్నారని అధికారులను ప్రశంసించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రతి రోజు 50 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది ఆంధ్రప్రదేశ్‌ అన్ని పేర్కొన్నారు. బాధితులకు సరైన వైద్యం అందించేందుకు శాయశక్తులా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం జగన్‌ అన్నారు.
 
అధికారులు విశ్లేషణాత్మక ధోరణితో ముందుకు పోవాలని సూచించారు. 'కరోనా మృతుల కుటుంబాలకు అంత్యక్రియల కోసం రూ.15వేలు అందజేస్తున్నాం. వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది' అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే, కరోనాతో ఎవరైతే చనిపోతే ప్రభుత్వమే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ప్రజల్లో ఇంకా కరోనా కట్టడికి తీసుకోవలిసిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు