మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

బుధవారం, 3 మార్చి 2021 (20:33 IST)
"తెలుసుకో... ఎదుగు.." (Know & Rise) అనే వినూత్న కార్యక్రమాన్ని కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ప్రారంభించారు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. "తెలుసుకో... ఎదుగు.." కార్యక్రమంలో అనంతపురం నగరం రాజేంద్ర మున్సిపల్ హై స్కూలుకు చెందిన 15 మంది విద్యార్థినీవిద్యార్థులు హాజరయ్యారు.
 
ప్రభుత్వ పరిపాలన మరియు కార్యకలాపాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన, నిర్ణయ సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాలు వెలికి తీయడానికి, వారిని రేపటి మార్గదర్శకులుగా తయారుచేయడానికి "తెలుసుకో... ఎదుగు" అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
తెలుసుకో.. ఎదుగు కార్యక్రమంలో భాగంగా తొలిరోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డిఈఓ, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను భాగస్వాములను చేశారు. సమావేశం ముగిసిన అనంతరం సమావేశంలో ఎలాంటి అంశాలు గమనించారు అనే విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. తమ అభిప్రాయాలను విద్యార్థినీ విద్యార్థులు వెల్లడించారు. 
 
ప్రభుత్వ పరిపాలన పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పించడం, జిల్లా పరిపాలనా యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందనే దానిపై అవగాహన కల్పించడానికి తెలుసుకో.. ఎదుగులో భాగంగా ఇకపై కూడా ఇలాంటి సమీక్షా సమావేశాల్లో ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులను భాగస్వాములను చేసి వారి ఎదుగుదలకు కృషి చేస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు