వైకాపా కండువా కప్పుకున్న అంబటి రాయుడు.. గుంటూరు లోకే‌సభ అభ్యర్థిగా బరిలోకి?

శుక్రవారం, 29 డిశెంబరు 2023 (10:58 IST)
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అలియాస్ అంబటి తిరుపతి రాయుడు వైకాపాలో చేరారు. ఆయనను ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పైగా, వచ్చే యేడాది జరిగే లోక్‌‍సభ ఎన్నికల్లో అంబటి రాయుడిని గుంటూరు లోక్‌సభ బరిలోకి దించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ ఆయన పేరును దాదాపుగా ఖరారు చేశారు. అంబటి రాయుడు గత ఆరు నెలల నుంచి గుంటూరు లోక్‌సభ పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు.
 
ఆ పార్టీ అధ్వర్యంలో జరిగే అనేక కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకుంటూ వస్తున్నారు. దీంతో ఆయనను గుంటూరు లోక్‍‌సభ సీటును కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. ఈ వార్తలను సీఎం జగన్ తాజాగా నిజం చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, అంబటి రాయుడు వైకాపాలో చేరే సమయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు కూడా ఉన్నారు. 
 
మాకొద్దీ ఈ సంబరాల రాంబాబు... అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ... 
 
ఏపీ జలవనరుల శాఖామంత్రి, వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ తగిలింది. మాకొద్దీ సంబరాలు రాంబాబు అంటూ వైకాపా నేతలు తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూకట్టారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు దాదాపు వంద మంది వరకు గురువారం ఉదయం తాడేపల్లికి వెళ్లి అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు. ఎంపీ, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 
 
అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వొద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. సంబరాల రాంబాబుకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని, మరొకరికి ఇస్తే మాత్రం విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇలా తమ నిరసన గళాన్ని వినిపించిన వారిలో విజయకుమారి కోటిరెడ్డి, అలేఖ్య కృపాకరరావు, సయ్యద్ సీమారఫి, రమేష్ రెడ్డి, రోశిరెడ్డి, మహేంద్ర, భూలక్ష్మి విజయకుమార్, అనిల్ కుమార్, వెంకట కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 
 
ఆ తర్వాత వారంతా సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన వారిని రాంబాబు పక్కకు నెట్టేశారు. పార్టీని సర్వనాశనం చేశారు. బ్రోకర్లను పెట్టుకుని దోచుకుంటున్నారు. గ్రామాల్లో పార్టీ రెడు గ్రూపులుగా మారిపోయేందుకు అంబటి రాంబాబు కారకులయ్యారు. సంబరాల రాంబాబు మాకొద్దు.. అంబటి రాంబాబు అస్సలు వద్దనే వద్దు అంటూ నినాదాలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు