ఆస్తి ఇవ్వలేదని తల్లికి కర్మకాండలు చేయని నలుగురు కుమారులు

బుధవారం, 13 మార్చి 2019 (20:21 IST)
నేటికాలంలో చాలామంది మనుషులు ఆస్తిపాస్తులకు ఇచ్చే విలువ బంధాలకు, బంధుత్వాలకు ఇవ్వడం లేదు. ఈ సమాజంలో ఎవరూ లేని అనాధలుగా కొంతమంది మిగులుతుంటే ఇంకొంతమందైతే దిక్కుమొక్కులేనివారిగా చనిపోతున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఆస్తి కోసం కొడుకులు రెండురోజులుగా తల్లికి కర్మకాండలు చేయలేదు. 
 
రత్నమ్మకు నలుగురు కొడుకులు ఉన్నారు. అనారోగ్యంతో రత్నమ్మ భర్త నాగరాజు ఐదు సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఈమె పేరు మీద రెండు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. పొలం మొత్తం రత్నమ్మ పేరు మీద ఉంది. నామిని ఎవరినీ పెట్టలేదు. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడే నలుగురు కొడుకులు వచ్చి పొలాన్ని తమ పేర్ల మీద రాయాలని అడిగారు. 
 
అయితే ఇప్పుడు కాదు. తరువాత రాస్తానని రత్నమ్మ చెప్పింది. దీంతో కొడుకులు ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. రెండురోజుల క్రితం అనారోగ్యంతో రత్నమ్మ చనిపోయింది. విషయం కొడుకులకు తెలిసింది. కానీ ఆస్తి లేకపోవడంతో కర్మకాండలకు ఎవరూ ముందుకు రాలేదు. అనాధ శవంలా రెండురోజుల పాటు రత్నమ్మ మృతదేహాన్ని అలాగే ఉంచి ఆ తరువాత గ్రామస్తులే దహనం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు