రేపు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఆన్‌లైన్ ప్రసంగం

సోమవారం, 15 జూన్ 2020 (22:06 IST)
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో రాజ్‌భవన్ నుండి ప్రసంగించనుండగా ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

రాష్ట్ర ప్రధమ పౌరుడు ఆన్‌లైన్ ప్రసంగం ద్వారా రాష్ట్ర శాసన మండలిని ఉద్దేశించి ప్రసంగించటం దేశ చరిత్రలోనే తొలిసారి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో భౌతిక దూరం పాటించాల్సి ఉండగా, గవర్నర్ హరిచందన్ ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.

సాధారణంగా శాసన సభ బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో గవర్నర్ శాసన మండలికి స్వయంగా వచ్చి రాష్ట్ర శాసన సభ, శాసన పరిషత్తులలోని సభ్యులందరినీ ఉద్దేశించి ప్రసంగించటం అనవాయితీ. ప్రస్తుత విపత్కర పరిస్ధితుల కారణంగా గవర్నర్ వైద్యపరమైన ప్రోటోకాల్‌ను పాటిస్తూ నూతన సాంప్రదాయానికి నాంది పలికారు.

ఈ క్రమంలో సోమవారం రాజ్ భవన్ నుండి ఉన్నతాధికారులు ఆన్‌లైన్ వ్యవస్ధకు సంబందించిన ముందస్తు రిహార్సల్ నిర్వహించారు. సాంకేతిక అంశాలపై గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఐటి, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మంగళవారం నాటి కార్యక్రమం లోప రహితంగా ఉండేలా చూడాలని విద్యుత్తుపరమైన ఆటంకాలు లేకుండా సమన్వయం చేసుకోవాలని దిగువ స్దాయి అధికారులకు ఆదేశించారు.

రాజ్ భవన్ నుండి గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయ్‌కుమార్ రెడ్డి, ముఖ్య సమాచార ఇంజనీర్ మధుసూధన్ తదితరులు, అసెంబ్లీ ప్రాంగణం నుండి శాసన మండలి కార్యదర్శి బాల కృష్ణమాచార్యులు ఆన్‌లైన్ విధానంలో ప్రత్యక్షంగా పాల్గొని వ్యవస్ధ పనితీరును సమీక్షించారు.

రాష్ట్ర ఐటి శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ సంయిక్తంగా ఆన్‌లైన్ వ్యవస్ధను పర్యవేక్షిస్తున్నాయి. శాసన సభలో శాసన సభ్యులు, శాసన పరిషత్తులో ఎమ్మెల్సీలు వేరు వేరుగా కూర్చుని గవర్నర్ ప్రసంగాన్ని విననున్నారు.

ఇందుకోసం ఆయా సభలలో ప్రత్యేకంగా గోడ తెరలను ఏర్పాటు చేశారు. ఉద‌యం 10 గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభం కానుండగా, ప్రధమ పౌరుని ప్రసంగం తదుపరి జాతీయ గీతంతో ఆన్‌లైన్ ప్రసంగం కార్యక్రమం ముగుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు