ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి : హీరో సుమన్

ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (17:28 IST)
సమాజంలో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో బుద్ధ బోధిధర్మ పురస్కారాల కార్యక్రమం ఆదివారం జరిగింది. సినీ నటులు, మా అధ్యక్షులు నరేష్ అధ్యక్షత వహించారు. 
 
ఇందులో సుమన్ పాల్గొని మాట్లాడుతూ, కుంగ్ ఫు, కరాటే, జిమ్నాస్టిక్స్ వంటి యుద్ధ విద్యలు మహిళల రక్షణకు ఎంతో అవసరమని అన్నారు. సమాజంలో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని కోరారు. 
 
నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవలికాలంలో మహిళలపై జరుగుతున్న దాడులను పోలీసు వ్యవస్థ సమర్థంగా నియంత్రి  స్తోందని వివరించారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వలన మానసిక స్థైర్యం పెరుగుతుందన్నారు.
 
సినీ నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ ప్రపంచానికి యుద్ధవిద్యలు పరిచయం చేసిన బ్రూస్ లీ ఆకర్షణీయమైన రూపం లేనప్పటికీ కేవలం మార్షల్ ఆర్ట్స్ ద్వారా ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. పలువురు సామాజిక సేవకులకు యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ముఖ్య అతిధి డాక్టర్  ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్ డాక్టరేట్ పురస్కారాలను ప్రదానం చేశారు. 
 
నగరానికి చెందిన వివిధ రంగాల ప్రముఖుల తో సహా న్యూ మంక్స్ కుంగ్ఫూ అసోసియేషన్ చైర్మన్ రవికుమార్, నరహరిశెట్టి శ్రీహరి, ఒలింపిక్ అధ్యక్షులు కె.పీ. రావు, చప్పిడి సూర్య నారాయణ,మాసాబత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు