పేద విద్యార్థుల ఉన్నత చదువులే ప్రభుత్వ లక్ష్యం: ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష

బుధవారం, 14 అక్టోబరు 2020 (21:17 IST)
పేద విద్యార్థులకు విద్య ఏమాత్రం భారం కాకూడదని విద్యార్థుల చదువులకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్బాష పేర్కొన్నారు.
 
బుధవారం రాయచోటి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నందు ఉప ముఖ్యమంత్రి  ఎస్ బి. అంజాద్బాష,  ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి.. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానం..విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ  చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. తల్లిదండ్రులు కేవలం తమ పిల్లలను బడులకు పంపించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు.

తల్లిదండ్రులు  గతంలో తమ పిల్లలను పాఠశాలలకు పంపాలంటే విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి ఎంత ఖర్చవుతుందో ఏమోనని పిల్లలను బడులకు పంపకుండా కూలిపనులకు షాపులలో పనిచేయుటకు పంపేవారన్నారు. నేడు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

జగనన్న విద్యా కానుక ద్వారా మూడు జతల బట్టలు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్షులు, బ్యాగు, బెల్టు, విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇవన్నీ బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి బడులు తెరవకముందే ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థుల బట్టలకు కుట్టు కూలీ సహా ప్రభుత్వం ఇస్తుందన్నారు.

ఈనెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపివారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు.

అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు 650 కోట్ల రూపాయలు ఖర్చుచేసి పేద విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న పిల్లలకు ప్రతి ఏటా 15 వేల రూపాయల చొప్పున తల్లుల ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు.

జగనన్న గోరుముద్ద పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45, 484 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం ప్రతి రోజు మెనూ ప్రకారం ఇవ్వడం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పేద విద్యార్థులకు  ఇన్ని వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం మన దేనన్నారు. అనంతరం ఎంఎల్సి కత్తి నరసింహారెడ్డి, జఖియ ఖానం మాట్లాడుతూ తప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి జగనన్న విద్య కానుక పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అయ్యే విద్యార్థుల  కొరకై జిల్లా వ్యాప్తంగా 20 శాతం అదనంగా జగనన్న విద్యా కానుక కిట్లు నిల్వ ఉంచడం జరిగిందన్నారు. కావున  విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందకుండా తమ పిల్లలను  ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే మన ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
                
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి, తాసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంపీడీవో అన్నయ్య, కడప
31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు