దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ కృషి ప్రశంసనీయం : జూపూడి

మంగళవారం, 19 జనవరి 2021 (20:17 IST)
దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ కృషి ప్రశంసనీయమని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్‌ను మంగళవారం జూపూడి నేతృత్వంలోని దళిత నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని జూపూడి కొనియాడారు. 
 
దళిత నేత కుంచే వెంకట రమణారావు మాట్లాడుతూ దళితుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్న సీఎం జగన్.. దళిత నేతలకు అత్యంత కీలకమైన పదవులు కేటాయించి నిజమైన సంస్కర్తగా నిలిచారని అన్నారు. 
 
డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలను దళితులకు అందేలా సుపరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దళితుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. సీఎస్‌ను కలిసిన వారిలో ద‌ళిత నేత‌లు కెన్నడి, గగారిన్, గిరి, డి.వెంకటరావు, నెరేడుమల్లి శ్రీను, భాస్కర్, బాలసుందరం త‌దితరులున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు