చీపుర్ల కోసం అడవికి వెళ్ళి తప్పిపోయిన మహిళా వృద్ధులు

శుక్రవారం, 24 జనవరి 2020 (16:48 IST)
కడప, వీరబల్లి-మండలంలోని ఈడిగపల్లె కు చెందిన చెనగాని వీరనాగమ్మ (60), గౌనేరి రాములమ్మ (65) అనే ఇద్దరు మహిళా వృద్ధులు గురువారం పొరక పుల్లలు (చీపురు కట్టలు) కోసం గ్రామ సమీపంలోని గడికోట అడవికి వెళ్ళి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో గ్రామస్థులు అడవి అంతా గాలించారు.

కానీ వీరి ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వీరబల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఐ రామాంజనేయుడు తన సిబ్బందితో అడవిలోకి వెళ్ళి రాత్రంతా గాలించారు. 
 
కానీ ఫలితం దక్కకపోవడంతో ఎస్ఐ పై విషయాన్ని శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులకు తెలపండంతో ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు రాయచోటి రూరల్, లక్కిరెడ్డిపల్లె సీఐ లు సుధాకర్ రెడ్డి, యుగంధర్, వీరబల్లి, సుండుపల్లె ఎస్ఐలు రామాంజనేయుడు, భక్తవత్సలం తోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది, గ్రామస్థులతో కలిసి అటవీ ప్రాంతమంతా మరో మారు జల్లెడ పట్టి ఎట్టికేలకు గడికోట కొండలో మహిళల ఆచూకీ కునుకొన్నారు. 
 
తప్పిపోయిన ఇద్దరినీ వారి స్వగ్రామానికి చేర్చిన పోలీసు, ఫారెస్టు బృందాలను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వీరబల్లి ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు మస్తాన్, శ్రీధర్, రఫీలు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు