మ‌హిళా ఉద్యోగిని చంప‌డం క‌ర్క‌శ‌త్వ‌మే: రవాణాశాఖ ఉద్యోగుల సంఘం

మంగళవారం, 5 నవంబరు 2019 (18:47 IST)
హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్మెట్ మండల్ తహసిల్దార్‌గా పనిచేస్తున్న విజయరెడ్డిని దారుణంగా హత్యచేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం.రాజుబాబు అన్నారు.

మ‌హాత్మాగాంధీ రోడ్డులోని స్థానిక డిటీసీ ఆఫీసు ప్రాంగణంలో మంగళవారంనాడు జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ఆధ్వర్యంలో ఉద్యోగులు పాల్గొని ఎమ్మార్వో  విజయరెడ్డి మృతిపట్ల చింతిస్తూ ఆమె కుటుంబసభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.

పనిభారం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ తీవ్ర పనిభారాన్ని కూడా లెక్కచేయకుండా కష్టపడి ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. నూతన విధానాల వలన ప్రజలకు మరిన్ని సేవలు అందించే దానిలో ప్రజలు పెట్టుకున్న అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నరని, అలాంటి ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు.

ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడం అనైతికమని రాజుబాబు అన్నారు.  ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి మీ సమస్యను పరిష్కరించుకోవాలి తప్పించి  హ‌త్య‌కు పాల్ప‌డ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్రశ్నించారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దీనిపై స‌మ‌గ్ర దర్యాప్తు చేయించి ఇటువంటి చ‌ర్య‌కు నిందితుడిని ప్రేరేపించిన వారిని గుర్తించి వారు ఎంతటివారైనా తీవ్రంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఆర్టీఓలు జగదీశ్వరరాజు, విజయసారధి, జోనల్ సంయుక్త కార్యదర్శి నాగమురళి, శ్రీనివాసరావు, సత్యనారాయణ, కవిత, జ్యోతి ఉద్యోగులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు