ముక్కు పుడకలతో మహిళలకు గాలం - బిర్యానీ ప్యాకెట్లలో సరఫరా చేస్తూ...

బుధవారం, 10 మార్చి 2021 (12:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగర, పట్టణ పురపాలక ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా సాగుతోంది. అయితే, కర్నూలు జిల్లా మునిసిపల్ ఎన్నికల్లో నంద్యాలలోని 12వ వార్డు నుంచి బరిలోకి దిగిన ఓ స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. 
 
ఖండే శ్యామసుందర్‌లాల్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా 12వ వార్డు నుంచి ఎన్నికల్లో బరిలోనిలిచాడు. ఓటర్లను ఆకర్షించి ఓట్లు పొందడానికి బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు ఉంచి పంచుతూ దొరికిపోయాడు. 
 
కర్ణాటక నుంచి కొందరిని కిరాయికి పిలిపించుకున్న శ్యామసుందర్ నిన్న బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు ఉంచి వారితో పంపిణీ చేయించాడు. ఈ విషయం పోలీసుల చెవిన పడడంతో వారు రంగంలోకి దిగారు. 
 
బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న రాఘవేంద్రస్వామి, రవికరణ్, మోహన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు బైక్‌లు, రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. వారితో ఈ పనిచేయించిన శ్యామసుందర్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు