అందంగా ఉన్న అమ్మాయిలు తన వద్ద ఉండాలి.. విద్యార్థినిలపై వైద్యుడి వేధింపులు..

గురువారం, 17 ఆగస్టు 2023 (09:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలతో పాటు ప్రభుత్వ అధికారులు సైతం మహిళల పట్ల వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని నిజం చేసేలా తాజాగా ఓ కీచక వైద్యుడి బండారం బయటపడింది. మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యార్థినిలను తన వికృత చేష్టలతో వేధించాడు. ఈ ఘటన కర్నూలులోని కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెలుగు చూసింది. ఇక్కడ పని చేసే విద్యార్థినిలు పట్ల వైద్యుడు కీచకుడిగా మారాడు. 
 
ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలల్లో ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం కోర్సుల్లో చేరిన విద్యార్థినులు శిక్షణ సమయంలో మూడు నెలలు ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. అలా కల్లూరు పీహెచ్‌సీకి వెళ్లిన విద్యార్థినులను రెండు నెలలుగా ఆ వైద్యుడు ఇబ్బంది పెడుతుండటంతో అక్కడికి వెళ్లాలంటేనే వారు జంకుతున్నారు. 
 
కృష్ణానగర్‌లోని ఆదర్శ నర్సింగ్‌ స్కూల్‌ ఏఎన్‌ఎం కోర్సులో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థినులు కల్లూరు పీహెచ్‌సీకి తాము వెళ్లమని వారం రోజులుగా చెబుతున్నారు. ఎందుకు వెళ్లరని నర్సింగ్‌ స్కూల్‌ కరెస్పాండెంట్‌ బుధవారం నిలదీయడంతో కీచక వైద్యుడి గురించి విద్యార్థులు బయటపెట్టారు. అందంగా ఉన్న విద్యార్థినులను తన వద్ద ఉండమని చెప్పడం, వెకిలి చేష్టలతో వారిని ఇబ్బంది పెట్టడం అతనికి అలవాటుగా మారిందని వాపోయారు. 
 
ఓపీ ఇలా రాయాలని చెబుతూ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. విద్యార్థినులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తమ భవిష్యత్‌ దృష్ట్యా వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని డీఎంహెచ్ఓ, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని కళాశాల కరస్పాండెంట్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు