గుంటూరులో మరో జ్యోతి ఆరిపోయింది... తనకు దక్కదని యువతిని గొంతుకోసి హత్య చేశాడు

శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (16:44 IST)
అమరావతి టౌన్‌షిప్ పరిధిలో తన ప్రియుడుతో ఏకాంతంగా ఉన్న జ్యోతి అనే యువతిపై కొందరు వ్యక్తులుదాడి చేయగా, ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసు విచారణలో భాగంగా, అసలైన నిందితులను ఇంకా గుర్తించలేదు. ఇంతలోనే గుంటూరు జిల్లాలో మరో జ్యోతి ఆరిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ యువతిని తండ్రి వయసున్న వ్యక్తి గొంతుకోసి హత్య చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు పట్టణానికి చెందిన బిట్రా సుధాకర్, దుర్గాభవాని దంపతులు పట్టణ ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో నివసిస్తున్నారు. వీరికి కుమారుడు ప్రవీణ్, శ్రీజ్యోతి (20) అనే పిల్లలు ఉన్నారు. ప్రవీణ్‌ ఆటోనగరులో ఓ స్టీలు కంపెనీలో పనిచేస్తుండగా, పదోతరగతి వరకు చదివిన శ్రీజ్యోతి ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు పెళ్లిసంబంధం మాట్లాడేందుకని సుధాకర్‌ దంపతులు గురువారం తెల్లవారుజామునే ఏలూరు బయలుదేరి వెళ్లారు. 
 
అయితే, సుధాకర్‌ స్వస్థలం భట్టిప్రోలుకు చెందిన నేతికుంట్ల సత్యనారాయణ (42) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన కొడుకుతోపాటు అదే ఈడు వాళ్లయిన సుధాకర్‌ పిల్లలనూ సత్యనారాయణ ఆడిస్తుండేవాడు. ఈ క్రమంలో కుమార్తె వయసున్న జ్యోతిపై సత్యనారాయణ కన్నేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఎవరి చేతనో తల్లిదండ్రులను అడిగించగా, సుధాకర్ అందుకు అంగీకరించలేదు. 
 
ఇంతలో జ్యోతి తల్లిదండ్రులు ఓ పెళ్లి సంబంధాన్ని కుదిర్చారు. దీంతో జ్యోతి తనకు దక్కదని భావించిన సత్యనారాయణ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీజ్యోతిని హత్య చేసి పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. అతని చర్యకు నిర్ఘాంతపోయిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లాంపేటలోని సుధాకర్‌ ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో శ్రీజ్యోతి మృతదేహం కనిపించింది. గొంతు నులిమి కూరగాయలు కోసుకునే కత్తితో పీక కోసినట్టు చెప్పాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు