జగన్ చాలా పెద్ద తప్పు చేశారు.. ఘోరంగా ఓడిపోతారు : ప్రశాంత్ కిషోర్

ఐవీఆర్

గురువారం, 7 మార్చి 2024 (09:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో అధికార వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోబోతున్నారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో జగన్ చాలా పెద్ద తప్పు చేశారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఎన్నికల ఫలితలపై స్పందించారు. 
 
ఏపీలో జగన్ ఓడిపోతున్నారు. అది కూడా మామూలు ఓటమి కాదు. భారీ ఓటమి తప్పదు అని ఆయన తెలిపారు. ఏపీలో చదువుకున్న యువత ఉపాధి, ఉద్యోగాల కోసం చూస్తున్నారే తప్ప.. ప్రభుత్వం ఇచ్చే తాయిలాల కోసం కాదని అన్నారు. గత ఐదేళ్లో మొత్తం వనరులను కొన్ని అంశాలపైనే ఖర్చు పెట్టడం, అభివృద్ధిని పట్టించుకోకపోవడం ద్వారా జగన్ పెద్ద తప్పు చేశారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. 
 
పాలకులకు ప్రజలు అందుబాటులో ఉండాలని దీనికి భిన్నంగా ప్యాలెస్‌లలో ఉంటూ ప్రజల బాగోగులన్నీ తామే చూసుకుంటున్నామని భావిస్తున్నారని, ఇలాంటి వైఖరిని ప్రజలు ఏమాత్రం హర్షించబోరన్నారు. ప్రజలు ఎన్నుకున్న పాలకలు ఒక ప్రొవైడర్ కంటే మెరుగైన పాత్ర పోషించాలి. కానీ, చాలా మంది నాయకులు తమను తాము ప్రజలకు రాయితీ కల్పించే ప్రొవైడర్లుగా భావించుకుంటున్నారనీ, అలాంటి వారు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించకతప్పదన్నారు. కాగా, గత 2019 ఎన్నికల్లో వైకాపాకు ప్రశాంత్ కిషోర్ వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు