ఏప్రిల్‌ నుంచి కొత్త రేషన్‌ కార్డులపై సరుకులు!

శనివారం, 29 ఫిబ్రవరి 2020 (08:46 IST)
కొత్త రేషన్‌ కార్డులపై ఏప్రిల్‌ నుంచి సరుకులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మార్చి నెలకు సంబంధించిన రేషన్‌ సరుకులు ఇప్పటివరకు వినియోగంలో ఉన్న కార్డులపైనే ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌరసరఫరాల శాఖకు ఉత్తర్వులు అందాయి.

ప్రభుత్వం రేషన్‌కార్డుల స్థానంలో బియ్యం కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మార్చి నుంచి ఈ కార్డుల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 8.31లక్షల కార్డుదారులు ఉన్నారు.

ఇందులో తెల్లకార్డులు 7.81 లక్షలు, అంత్యోదయ కార్డులు 49,806, ఏఏపీ కార్డులు 955 ఉన్నాయి. ఈ కార్డుదారులందరికీ ఈ నెల 22వ తేదీ నాటికి బియ్యం కార్డులు పంపిణీ చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 

కానీ, జిల్లాకు అరకొరగానే బియ్యం కార్డులు వచ్చాయి. సాంకేతిక సమస్య కారణంగా బియ్యం కార్డుల ముద్రణ జాప్యమైంది. వచ్చిన  వాటిలోనూ చాలా వరకూ తప్పులు తడకలు చోటుచేసుకున్నాయి.

ఒక మండలంలో కార్డుదారుడి పేరు.. వేరే మండలంలోని గ్రామంలో ఉన్నట్లు చూపుతోంది. ఇంటి పేర్లు, వ్యక్తుల పేర్లు సైతం తప్పుగా నమోదయ్యాయి. దీంతో కార్డుదారులు అయోమయానికి గురవుతున్నారు.

మార్చి నెల సరుకులు అందుతాయో లేదోనని సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మార్చి నెలకు సంబంధించి పాత కార్డులపైనే బియ్యం సరఫరా చేయాలని ఆదేశించింది. త్వరగా కొత్త బియ్యం కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు