భార్యకు అనారోగ్యమంటూ సెలవుపై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్... బాబు భద్రతకు ముప్పు తప్పదా?

శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (13:54 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తప్పు జరిగినట్టు బాధ్యుడిని చేసి తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ జైలు సూపరింటెండెంట్‌‍గా ఎస్.రాహుల్ కొనసాగుతున్నారు. అయితే, ఈయన ఉన్నట్టుండి నాలుగు రోజులు సెలవుపై వెళ్లిపోయారు. తన భార్య అనారోగ్యంగా ఉందని చెప్పి నాలుగు రోజులు సెలవు పెట్టారు. ఇప్పటికే బాబు భద్రతపై ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఇపుడు జైలు సూపరింటెండెంట్ ఉన్నట్టుండి సైలవుపై వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అదీ కూడా ములాఖత్‌లో చంద్రబాబును పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణలు కలిసిన గంట వ్యవధిలో ఆయన సెలవుపై వెళ్లడం గమనార్హం. 
 
తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెలవు పెట్టారని ఉన్నతాధికారులు వివరించారు. ఆ నాలుగు రోజులూ జైళ్ల శాఖ కోస్తాంధ్ర ప్రాంత డీఐజీ రవి కిరణ్ జైలు పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటారు. రాహుల్ సెలవుపై వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబును జైలుకు తీసుకువచ్చిన నాటి నుంచే... రాహుల్‌కు నోటీసు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. 
 
చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి కూడా భద్రతపై అనుమానం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 12వ తేదీ రాత్రి జైలులో డీఐజీ రవికిరణ్ తనిఖీలు చేపట్టారు. 13న మరోమారు ఎస్సీ జగదీశ్‌తో కలిసి చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రాహుల్ సెలవు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే నెలలో సూపరింటెండెంట్ రాజారావును ఆకస్మికంగా అటాచ్‌మెంట్‌పై పంపేస్తూ డీజీ ఆదేశాలు జారీ చేయడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు