తిరుమలలో ప్రశాంతంగా శ్రీవారి సేవలో నిమ్మగడ్డ, కానీ పార్టీలకు గుబులెత్తిస్తున్నారు

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (22:21 IST)
రాష్ట్రరాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల కన్నా ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశమే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిఎంతో పాటు మంత్రులకు నిద్ర లేకుండా చేస్తున్నారు.
 
అధికారం వైసిపిదే అయినా ఒకే ఒక్క పదవితో నిమ్మగడ్డ గందరగోళానికి తెరలేపుతున్నారు. పంచాయతీ ఎన్నికలు వద్దని ప్రభుత్వం భావిస్తే చివరకు పంచాయతీ ఎన్నికలను జరిపించేస్తున్నారు. ఇక మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అది కూడా మరో రెండు రోజుల్లో పూర్తి కాబోతోంది.
 
మూడవ విడత తరువాత ఇక నాలుగవ విడత 21వ తేదీ పూర్తి కాబోతోంది. ఇదిలా ఉంటే ఉన్నట్లుండి పురపాలక, నగర పాలకసంస్ధ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు ఎస్ఈసి. ఈ షెడ్యూల్ ప్రకారం గతంలో ఏవిధంగా అయితే ఎన్నికల ప్రక్రియ జరుగుతూ వచ్చిందో.. ఇప్పటి ఎన్నికల్లో కూడా అదే కొనసాగాలన్నారు.
 
దీంతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. గత మూడురోజుల నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుపతిలోనే ఉంటున్నారు. ఇక్కడి నుంచే తన నిర్ణయాలు మొత్తాన్ని తీసేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయడంతో పార్టీ నేతల్లో ఒకింత హైరానా నెలకొంది. 
 
ఒకవైపు సంచలన నిర్ణయాలు, మరోవైపు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్సిస్తూ ప్రశాంతంగా ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. నిన్న ఉదయం, ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్సించుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ స్వామివారి సేవలో ఎస్ఈసి పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు