నేడు గవర్నర్‌ను కలవనున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

బుధవారం, 27 జనవరి 2021 (09:35 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారు. నేడు ఉదయం 10.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ఎస్‌ఈసీ వివరించనున్నారు.  
 
తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తొలి దశ ఎన్నికలకు సిద్ధంకాకపోవడంతో కొత్త షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ప్రకటించింది. కొత్త షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 9న తొలిదశ, 13న రెండో దశ, 17న మూడో దశ, 21న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9న జరిగే ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 29న  ప్రారంభమవుతుంది. 13న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 2 నుంచి, 17న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 6 నుంచి, 21న జరిగే ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
 
మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఏపీ ప్రభుత్వం పెంచింది. జనాభా ప్రాతిపదికన రూ.20లక్షల వరకు ప్రోత్సాహకంగా అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షలు, 2వేల నుంచి 5వేలు ఉంటే రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల జనాభాకు రూ.15లక్షలు, 10వేల జనాభా దాటితే రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు