ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్.... ఎప్పటి నుంచి అంటే...

శుక్రవారం, 22 డిశెంబరు 2023 (07:51 IST)
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలని భావించే వారి కోసం ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్ళు ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 26వ తేదీల మధ్య నడుపుతామని పేర్కొంది. ఈ రైళ్లను కాచిగూడ - కాకినాడ టౌన్, హైదరాబాద్ - తిరుపతి మార్గాల్లో నడుపనున్నట్టు తెలిపింది. వీటిలో స్లీపర్, జనరల్ బోగీలతో పాటు ఫస్ట్ ఏసీ, సెంకడ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీలు కూడా ఉంటాయని పేర్కొంది. 
 
తిరుపతి - హైదరాబాద్ (07510) ప్రాంతాల మధ్య డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రత్యేక రైలును నడుపుతారు. శుక్రవారం రాత్రి 8.15 గంటల ప్రయాణం మొదలై శనివారం ఉదయం 8.40 గంటలకు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతుంది. 
 
హైదరాబాద్ - తిరుపతి రైలు (07509) సర్వీసు ఇక డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది. గురువారం రాత్రి 7.25 గంటలకు బయల్దేరి శుక్రవారం ఉదయం 8.20 గంటలకల్లా గమ్యస్థానం చేరుతుంది. 
 
అదేవిధంగా హైదరాబాద్ - తిరుపతి - హైదరాబాద్ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయని ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.
 
అలాగే, కాచిగూడ - కాకినాడ టౌన్ రైలు (07653) డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో (గురువారాలు) రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుతుంది. ఇక కాకినాడ టౌన్ - కాచిగూడ రైలు (07654) డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. 
 
ఈ రైలు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు