సీఎం జగన్ కళ్లలో ఆనందం చూసేందుకే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు : టీడీపీ

గురువారం, 28 సెప్టెంబరు 2023 (12:21 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతర పరి
ణామాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నేతలు అయిన మంత్రి కేటీఆర్ తీరును ఎండకడుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణాలో నిరసనలు చేయొద్దంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసేందుకేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఏపీ రాజకీయాలకు తెలంగాణతో సంబంధం ఏంటని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ కళ్లలో ఆనందం చూసేందుకేనని విమర్శించారు. టీడీపీ నేతలు బుధవారం ఎన్టీఆర్‌ భవన్‌లో వేర్వేరుగా మాట్లాడారు. శాంతియుత ర్యాలీలను మంత్రి కేటీఆర్‌ ఆపలేరని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. 
 
'కేటీఆర్‌ వ్యాఖ్యలు చూస్తోంటే తెలంగాణలో ప్రాథమిక హక్కులకు న్యాయం జరగదనిపిస్తోంది. కేసీఆర్‌ పంజాబ్‌కు వెళ్లి అక్కడి రైతులకు చెక్కులు ఎందుకు ఇచ్చారు?' అని ప్రశ్నించారు. 'కేటీఆర్‌ వ్యాఖ్యల్ని హైదరాబాద్‌ ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాసను ఓడిస్తాం. సిద్ధరామయ్య, స్టాలిన్‌లకులేని ఇబ్బంది కేటీఆర్‌కు ఎందుకు? భారాస ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నిరసన ర్యాలీలో పాల్గొనలేదా?' అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధులు అనూప్‌కుమార్‌, శ్రీనివాస్‌నాయుడు ప్రశ్నించారు. 
 
రాబోయే రోజుల్లో భారాస ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడతారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అన్నారు. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలపై తెదేపా రాష్ట్ర కార్యదర్శి షేక్‌ ఆరీఫ్‌ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై భారాస విధానం ఏంటో చెప్పాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్‌ అన్నారు. 2024 వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు