వైట్నర్ మత్తులో మహిళల వీరంగం... సాటి మహిళను చావబాదారు

సోమవారం, 6 మే 2019 (11:46 IST)
మత్తు కోసం యువత పెడదోవపడుతున్నారు. గంజాయితో పాటు వివిధ రకాల డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. వీరిలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇపుడు మహిళలు కూడా చేరారు. తాజాగా కొందరు మహిళలు మత్తుకోసం వైట్నర్‌ను పీల్చారు. ఈ ఘటన హైదారాబాద్‌లోని ఫలక్‌నుమాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మదన్‌ఖాన్‌ మల్గీ ప్రాంతానికి చెందిన షబానా(32), పర్వీన్‌(30), అయేషా(30), జబీన్‌(31)లు శనివారం సాయంత్రం ఫాతిమానగర్‌కు చెందిన గోరీబీ(50) ఇంటికి వెళ్లారు. అప్పటికే వైట్నర్ మత్తులో ఉన్న వారందరూ కలిసి గోరీబీ కుమార్తె విషయమై ఆమెతో గొడవపడి చేయిచేసుకున్నారు. 
 
ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశారు. అక్కడితో ఆగక గోరీబీ చిన్న కుమార్తె సబాబేగం(13)ను కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారు. దీంతో గోరీబీ నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఓ ఇంట్లో బందీగా ఉన్న సబాబేగంను విడిపించారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
ఆ సమయంలో అక్కడే ఉన్న గోరీబీని చూసి రెచ్చిపోయిన నిందితులు పోలీసుల ఎదుటే ఆమెపై దాడికి దిగారు. నోటికి వచ్చినట్టు తిడుతూ కొడుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన మహిళలు పోలీసులపైకి చెప్పులు విసిరారు. మహిళపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ తరహా ఘటనలు తరుచుగా వెలుగులోకి వస్తుండటంతో వాటిని ఎలా అదుపు చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు