చట్ట సభలో రౌడీల్లా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు: టీడీపీ ధ్వజం

గురువారం, 18 జూన్ 2020 (16:39 IST)
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, చట్టసభలంటే వారికి లెక్క లేదని టీడీపీ ధ్వజమెత్తింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి ప్రకటన విడుదల చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...?
 
5 కోట్ల మంది ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించాల్సిన పవిత్రమైన చట్ట సభలంటే వైసీపీ ప్రభుత్వానికి లెక్కలేనితనంగా వ్యవహరిస్తుంది. కూల్చివేతలు, దౌర్జన్యాలు, దాడులు, దుర్మార్గాలతో వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన సాగింది. ప్రభుత్వానికి  చట్టాలంటే గౌరవం లేదు, న్యాయస్థానాలంటే విలువ లేదు, ప్రజాస్వామ్యం అంటే భయం లేదు.

మంత్రులు తమ స్థాయిని మరిచి వీధి రౌడీల్లా దుర్బాష లాడటం, దాడులు చేయడం చట్టసభలను అగౌరవపర్చడమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ అంటే తన ఇడుపులపాయ ప్యాలెస్ లా భావిస్తున్నారు. నిన్న పెద్దల సభలో వైసీపీ మంత్రుల తీరు చూస్తుంటే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని స్పష్టం అయ్యింది.

ద్రవ్య వినిమయ బిల్లుకు అన్ని విధాలుగా సహకరించినా చర్చ జరగనివ్వకుండా దూషణులు, దాడులకు పాల్పండి అధికారపక్షమే. ఈ బిల్లును ప్రభుత్వం ప్రాధాన్యంగా భావించకపోవడం వైసీపీ నాయకుల చిత్తశుద్ధికి అద్దం పడుతుంది.

ప్రజా రాజధాని అమరావతి బిల్లును అడ్డుకొని రైతులకు అండగా నిలిచిన టీడీపీ శాసనమండలి సభ్యులపై వైకాపా మంత్రులు ఇష్టానుసారంగా దుర్బాషలాడి, దాడులు చేశారు. 

ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాజధాని మార్పుపై ప్రభుత్వం తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ అడ్డుకొని ప్రజా పక్షాన నిలుస్తుంది. 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి దోహదపడే అమరావతిని మూడు ముక్కలు చేసి నిర్వీర్యం చేయాలనుకోవడం దుర్మార్గం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు