తెలంగాణాలో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం తథ్యం : వైకాపా ఎంపీ జోస్యం

ఠాగూర్

మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (09:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం తథ్యమని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా విభజన చేసిందన్నారు. తెలంగాణ ఇచ్చాం... రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆశించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రుకాల్చివాత పెట్టారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పలేదని ఎద్దేవాచేశారు. పదేళ్లపాటు నానా బాధలు పడిన కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అనేక అబద్ధాలు చెప్పి తెలంగాణాలోకి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే, తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని, త్వరలోనే కుప్పకూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలిట అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని, ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పారని, కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధివుండివుంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశానికి ఎందుకు చోటు కల్పించలేదన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం చేతగాని కాంగ్రెస్ పార్టీ... ఇపుడు తమను ఎందుకు నిందిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కానీ, ఎన్నికలు వస్తుండటంతో దీనిని ఒక ప్రచార అస్త్రంగా ఎంచుకుందని నిలదీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు