అన్నా.. మేనల్లుడి పెళ్లికి రా! - కొడుకు వివాహానికి జగన్‌ను ఆహ్వానించనున్న షర్మిల

బుధవారం, 3 జనవరి 2024 (10:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్న వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల తన అన్న, ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డితో బుధవారం తాడేపల్లిలో సమావేశం కానున్నారు. తన కుమారుడు, ఆయన మేనల్లుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. 
 
బుధవారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి ప్యాలెస్‌కు రావాలని షర్మిలకు జగన్‌ నుంచి సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె విజయవాడ రానున్నారు. తాడేపల్లి వెళ్లి జగన్‌కు పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానించాక.. నేరుగా గన్నవరం విమానాశ్రయం వెళ్లి.. ఢిల్లీ బయల్దేరతారు. తన విజయవాడ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని ఆమె కాంగ్రెస్‌ నేతలకు తెలియజేసినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బుధవారం ఉదయమే ఢిల్లీ వెళ్తున్నారు. 
 
ఇదిలావుంటే మంగళవారం కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ఆర్ సమాధిని సందర్శించి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులు ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని, దీనిపై ఇది వరకే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దేశంలోని అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ అయిన కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. 
 
కాంగ్రెస్‌లో పనిచేయాలని ఇదివరకే నిర్ణయించామని, తెలంగాణలో కాంగ్రెస్‌కు తాము మద్దతివ్వడం వల్లే అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్‌ఆర్‌టీపీ చాలా పెద్దపాత్ర పోషించిందని.. 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 10 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని, తాము పోటీచేయకపోవడమే దీనికి కారణమని తెలిపారు. తాము పోటీ చేసి ఉంటే కాంగ్రెస్‌కు ఇబ్బంది తలెత్తేదని, తమ పార్టీ, తాను చేసిన త్యాగానికి విలువిచ్చి.. కాంగ్రెస్‌ ఆహ్వానించిందన్నారు. 
 
'ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీ. ప్రజల భద్రత కోసం పనిచేసే పార్టీని బలపరచాలని నిర్ణయించాం. బుధవారమే ఢిల్లీ వెళ్తున్నా. ఒకటి రెండు రోజుల్లో మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది' అని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాక షర్మిల విజయవాడ రానున్నారు. ఆమె సమక్షంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులతో కలసి పార్టీలో చేరతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు