స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణంరాజు : విజయసాయిరెడ్డి

శుక్రవారం, 3 జులై 2020 (17:26 IST)
వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణరాజు తమ పార్టీ ఎంపీగా ఉంటూ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 
 
శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన వైకాపా ఎంపీల బృందం... లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేశారు. 
 
ఈ భేటీ తర్వాత వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయడానికి వీలైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్‌ను కోరామని, అనర్హత పిటిషన్‌ను సమర్పించామని వివరించారు. స్పీకర్ అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
 
ఇకపోతే, 'ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అనేది ఓ పునాది వంటిది. రఘురామకృష్ణరాజు అలాంటి పునాదిని కదిలించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూలదోసే విధంగా ప్రయత్నం చేశారు. ఏ పార్టీ టికెట్‌తో ఆయన గెలిచారో, ఏ పార్టీ మేనిఫెస్టోతో ప్రచారం చేసుకుని గెలిచారో ఆ పార్టీకి అనుగుణంగా ఆయన నడుచుకోవడంలేదు. 
 
పార్టీ అధ్యక్షుడ్ని గౌరవించకపోవడం, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి అనేక చర్యలకు పాల్పడ్డారు. సరిగ్గా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు సొంతపార్టీలో విపక్షం లాంటివారు. వైసీపీలో ఉంటూనే ఇతర పార్టీలతో మంతనాలు జరిపారు. అందుకే అనర్హత పిటిషన్‌ను రూపొందించి స్పీకర్‌కు ఇవ్వడం జరిగింది. సొంతపార్టీలో ఉన్నవాళ్లను దూషిస్తూ, విపక్షాలతో లాలూచీ పడి దిగజారిపోయారు. 
 
ఊహాజనిత కారణాలను ప్రచారం చేయాలనుకున్నారు. ఏదైనా ఉంటే పార్టీ అధ్యక్షుడికి చెప్పుకోవాలి కానీ, బహిరంగంగా మాట్లాడాలనుకోవడం పార్టీ విధివిధానాలకు అనుగుణం కాదు. రఘురామకృష్ణరాజు ఆరోపణల్లో విశ్వసనీయత లేదు. రఘురామకృష్ణరాజు భౌతికంగా వైసీపీలో ఉన్నా, ఆయన హార్ట్ అండ్ సోల్ ఇక్కడ లేదు. మనసా వాచా కర్మణా పార్టీ కోసం పనిచేసేవాళ్లే వైసీపీకి కావాలి. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నాం' అని వివరణ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు