సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?

బుధవారం, 16 డిశెంబరు 2020 (14:04 IST)
చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. అయితే గర్భిణులు మాత్రం తక్కువగా తినాలని ఇప్పుడు సైంటిస్టులు, నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకపక్క చేపల సంతతి తగ్గిపోతున్న తరుణంలో చేపలు తినడం నిజంగా ఆరోగ్యానికి ఎంతవరకు ప్రయోజనకరం అన్నది చర్చనీయాంశంగా మారింది.

 
శాఖాహారం సమృద్ధిగా లభిస్తున్నవేళ, సముద్ర జీవుల్లో కార్బన్‌ అవశేషాలు పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో చేపలను తినడం మనకు ఎంతవరకు అవసరం అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం 1974తో పోలిస్తే చేపల సంతతి 90% నుంచి 66% శాతానికి పడిపోయిందని అంచనా.

 
అయితే మిగతావారి సంగతి ఎలా ఉన్నా సముద్ర జలాల్లో పాదరసంతో పాటు ఇతర రసాయనాలు ఎక్కువగా కలుస్తుండటంతో గర్భిణులు, పాలిచ్చే తల్లులు చేపల్లాంటి కొన్ని సముద్ర జీవులను తినడం తగ్గిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 
చేపల్లో భార లోహాలు
సముద్ర జలాల్లో చేరుతున్న వ్యర్ధ కాలుష్యాలు, లోహాల ప్రభావం చేపలపై గణనీయంగా పడుతోందని గత కొన్ని దశాబ్దాలుగా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. పరిశ్రమల వ్యర్ధాల నుంచి వచ్చే పాలీక్లోరినేటెడ్‌ బైఫెనైల్‌(పీసీబీ)లను 1980ల నుంచి నిషేధించినా అవి అటు భూమిలోనూ, ఇటు నీటిలోనూ గణనీయంగా చేరుతూనే ఉన్నాయని తేలింది.

 
మనిషి మెదడు నుంచి వ్యాధి నిరోధక వ్యవస్థ వరకు శరీరంలోని వివిధ భాగాల మీద అవి ప్రభావం చూపిస్తాయని నిపుణులు తేల్చారు. పాలు, మంచినీరు లాంటి వాటిలో ఈ పీసీబీల ఆనవాళ్లు ఉన్నా, చేపల్లో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వాటి ప్రభావం నుంచి బైటపడాలంటే అవి ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోకుండా ఉండటమే మార్గమని ఇంగ్లండ్‌లోని రోథమాస్టెడ్‌ రీసెర్చ్‌కు డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న జోనాథన్‌ నేపియర్‌ అన్నారు.

 
“మనుషులు వేటాడి తినే ప్రాణుల్లో ఈ తరహా ప్రమాదకర అవశేషాలు ఎక్కువగా ఉన్నాయి’’ అన్నారాయన. అందుకే సముద్రాలలో దొరికే చేపలకన్నా, చెరువుల్లో పెంచే చేపలు కొంతవరకు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చేపల చెరువులు కూడా సముద్ర జలాల కాలుష్యానికి చాలా వరకు కారణమవుతున్నాయి. ఈ చెరువుల నుంచి వచ్చే వర్ధ్యాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తుండటంతో ఇక్కడ పుట్టే వ్యాధులన్నీ సముద్రపు చేపల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి.

 
పీసీబీ శాతం ఎక్కువున్నందున చేపలను తీసుకోవడం తగ్గించాలని ఇంగ్లండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్‌ దేశంలోని గర్భిణులకు సూచించింది. ఇక నీళ్ల ద్వారా చేపలలో, తద్వారా మనుషుల కడుపులోకి వెళ్లే పాదరసం అవశేషాలు మనిషి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ కారక లోహాలలో ఒకటిగా పాదరసానికి పేరుంది. అలాగే డయాబెటీస్‌, గుండె సంబంధ సమస్యలకు పాదరసం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.

 
కూరగాయలలోనూ కొంత శాతం ఉన్నా, 78% పాదరసం చేపల ద్వారానే మనుషుల శరీరంలోకి వస్తుందని పరిశోధనలు తేల్చాయి. అందుకే టూనా, హాలీబట్‌ లాంటి చేపలను తినడం తగ్గించాలని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డిఎ) గర్భిణులకు సూచించింది. అయితే చేపలలో పాదరసంతోపాటు కొన్ని భార లోహాల అవశేషాల గురించి కొంత ఎక్కువగా ప్రచారం జరుగుతున్నా, వాటి పరిమాణం ఎక్కువకాలం జీవించి ఉండే చేపలలోనే ఉంటుందని నేపియర్‌ అన్నారు. అయితే దీని మీద ఇంకా పరిశోధన జరుగుతోందని ఆయన తెలిపారు. భూమి మీద వేడి పెరుగుతున్న కొద్దీ నీటిలో పాదరసం కలిసే అవకాశాలు కూడా పెరుగుతాయని, ఆర్కిటిక్‌ కరుగుతున్న కొద్దీ సముద్రాలలో మెర్క్యురీ అవశేషాలు ఎక్కువవుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 
సముద్రపు చేపలు వర్సెస్ పెంపుడు చేపలు
సాలమన్‌, టూనా, సార్డైన్స్‌, మాకెరెల్‌లాంటి కొవ్వులు ఎక్కువ ఉండే చేపలు తింటే గుండె సంబంధ సమస్యలు పెద్దగా రావని, దీనికి ఈకో సపెంటానోయిక్‌(ఈపీఏ), డొకోసాహెక్జానిక్‌ యాసిడ్‌(డీహెచ్‌ఏ), మెరైన్‌ ఒమెగా-3 అనే ఫ్యాటీ ఆమ్లాలే కారణమని పరిశోధనలు తేల్చాయి. అయితే మొక్కల నుంచి వచ్చే ఒమెగా-3లాంటి ఫ్యాటీ ఆమ్లం సముద్ర జీవుల నుంచి వచ్చే ఫ్యాటీ ఆమ్లాలకు సరితూగుతుందా లేదా అన్నదానిపై మాత్రం ఇంకా పరిశోధన జరుగుతోంది.

 
“ఈపీఏ, డీహెచ్‌ఏలు రెండూ మానవ జీవక్రియలలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ అవే ముఖ్యమనుకోవడం కూడా పొరపాటే. వాటిని ఎంత వరకు తీసుకోవాలో అంత వరకు తీసుకోవడం మంచిది’’ అన్నారు నేపియర్‌. మానవ మస్తిష్కం, రెటీనా, ఇంకా కొన్ని కణాలలో డీహెచ్‌ఏ ఎక్కువగా ఉంటుంది. ఈపీఏతో కలిసి అది శరీరంలో ఏర్పడే మంటల్లాంటి పరిస్థితులను అదుపుచేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మంటలే గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌, డయాబెటీస్‌ లాంటి వాటికి కారణమవుతాయి.

 
“ఈపీఏ, డీహెచ్‌ఏ ఉన్న పదార్ధాలను ఎక్కువగా తీసుకునేవారిలో సాధారణంగా జబ్బుల సమస్య తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులు తక్కువగా ఉంటాయి’’ అని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాంప్టన్‌లో పని చేస్తున్న ప్రొఫెసర్‌ ఫిలిప్‌ కాల్డర్‌ అన్నారు.

 
ఒమెగా-3ని తీసుకుంటున్నప్పుడు మెర్క్యూరీ ప్రభావాన్ని తగ్గించడానికి చేపల నూనె తీసుకోవడం ఒక మార్గంగా చెబుతున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన పరిశోధనలో దీని ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని చెబుతున్నారు. నేరుగా చేపలను తీసుకున్నప్పటి ప్రభావం, చేపల నూనెను తీసుకోవడంలో ఉండదని ఈ పరిశోధన తేల్చింది.

 
వరసగా నాలుగైదు సంవత్సరాలపాటు ఒమెగా-3 తీసుకున్న 334 మందిలో ఒక్కరు కూడా గుండె సంబంధ సమస్యలతో చనిపోలేదని ఒక పరిశోధన తేల్చి చెప్పినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్ ఆంగ్లియాలో రీడర్‌గా పని చేస్తున్న లీ హూపర్‌ వెల్లడించారు. అయితే చేపలను తినడం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఏ మేరకు అవి ఈపీఏ, డీహెచ్‌ఏలుగా పరివర్తన చెందుతాయన్నది మనిషికి మనిషికి తేడా ఉంటుంది.

 
సదరు మనిషి జీవన విధానం, అతను తీసుకునే ఇతర ఆహార పదార్ధాలతోపాటు జన్యుక్రమం ప్రభావం కూడా ఉంటుందని ఫిలిప్‌ కాల్డర్‌ వెల్లడించారు. చేపలు తినడం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటి అన్న అంశంలో ఆ చేపను ఎక్కడు పెంచారు అన్నది కూడా కీలకమేనంటారు నిపుణులు. సముద్రాంతర్భాంగంలో ఒమెగా-3కి కొరత లేదు. మొక్కల నుంచి చిన్నచేపలు, చిన్న చేపల నుంచి పెద్ద చేపలు, పెద్ద చేపల నుంచి మనుషుల వరకు ఈ ఇది రవాణా అవుతూ ఉంటుంది. కానీ మనం పెంచే చేపల్లో ఈ క్రమం ఉండదు. “ పెంపుడు చేపలు రైతు పెట్టిన తిండి తిని పెరుగుతాయి’’ అన్నారు నేపియర్‌.

 
పైగా పెంపకపు చేపలు ఒకే జాతికి చెందిన చిన్న చేపలను తింటాయి. కానీ నదులు, సముద్రాలలో పెరిగే చేపలు వివిధ జాతుల చేపలను తిని పెరుగుతాయి. 2016లో జరిగిన పరిశోధనల్లో సాలమన్‌ చేపలలో పెరిగే ఈపీఏ, డీహెచ్‌ఏ శాతాలు దశాబ్దకాలంలో దాదాపు సగానికి తగ్గాయని, సముద్రపు చేపలలోకన్నా, పెంపకపు చేపలలోనే ఒమెగా-3 ఎక్కువగా కనిపించిందని నేపియర్‌ వెల్లడించారు.

 
మెదడుకు మేత
ఒమెగా-3తోపాటు ఇన్ఫెక్షన్లను తగ్గించే అనేక పోషకాలు చేపలలో ఉంటాయని తేలింది. అలాగే చేపలు తినడం వల్ల మెదడు చురుకుగా ఉంటుందని నమ్ముతారు. ఒమెగా-3కి మెదడు వేగానికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉడికించిన చేపను తినడం వల్ల మెదడు పరిమాణం పెరగుతుందని కూడా గమనించారు. మెదడుపై చేపల నుంచి వచ్చే పోషకాల ప్రభావం మీద పరిశోధనలో భాగంగా 70 సంవత్సరాలు దాటిన 163 మంది మెదళ్లను ఎమ్మారై స్కాన్‌ చేశారు.

 
అయితే చేపలు తినని వారి మెదళ్లతో పోల్చినప్పుడు వారానికొక్కసారైన చేపలను తినే వారి మెదళ్ల సైజు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, తెలివి మీద పని చేసే మెదడు ప్రాంతాల పరిణామం ఎక్కువగా ఉందట. చేపలను తినడంలో ఇంకొక ప్రయోజనం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. “మనం చేపలు ఎక్కువ తింటే మనకు ఇతర ఆహార పదార్ధాలను తినబుద్ధి కాదు’’ అన్నారు హూపర్‌.

 
చేపల తినని వారికి కలిగే నష్టాల గురించి పూర్తిస్థాయిలో పరిశోధనలు లేకపోయినా, తినేవాళ్లకు మాత్రం చాలా ప్రయోజనాలున్నాయి అన్నారు కాల్డర్‌. ఒమెగా-3 ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ముఖ్యంగా గుండెకు మంచిదని ఆయన చెప్పారు. కాకపోతే మనం తినే చేపలు ఎంత ఆరోగ్యవంతమైనవి అన్నదే అసలు సమస్య. “ ఆల్గేను పెంచడం, ఒమెగా-3ని సేకరించడంపై పరిశోధనలు వేగవంతం కావచ్చు’’ అన్నారు కాల్డర్‌.

 
మంచి రకం చేపలేవో వెతుక్కుని తినడం వల్ల కొంత వరకు ప్రయోజనం ఉంటుంది. మెరైన్‌ కన్సర్వేషన్‌ సొసైటీ ఏయే రకాల చేపలు మంచివో ఒక జాబితా తయారు చేసింది. 133 రకాల చేపల జాతులలోని 50 రకాల చేపలను మంచివిగా ఈ జాబితాలో పేర్కొంది. అదృష్టంకొద్దీ మనకు ఎక్కువగా లభించే, ఎక్కువమంది ఇష్టపడే పెంపకపు సాలమన్‌లు, రొయ్యలు, కాడ్‌, మాకెరెల్, మస్సెల్స్‌, ఓయెస్టర్స్‌, పెంపకపు హాలిబాట్‌ లాంటి చేపజాతులు ఈ లిస్టులో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు