మీకు దండం పెడతా.. అప్పులన్నీ చెల్లిస్తా.. విముక్తి కల్పించండి : విజయ్ మాల్యా

గురువారం, 14 మే 2020 (12:27 IST)
ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దిగివస్తున్నారు. ఆంక్షలతో కూడిన జీవితాన్ని గడపలేక స్వేచ్ఛాజీవిగా మారేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తీసుకున్న రుణాలన్నీ వంద శాతం చెల్లిస్తానని తనను విముక్తుడిని చేయాలంటూ ప్రాధేయపడుతున్నారు. 
 
కరోనా మహమ్మారి నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బ‌య‌ట‌ప‌డేసేందుకు రూ.20 ల‌క్ష‌ల కోట్ల భారీ ప్యాకేజీ ప్ర‌క‌టించిన కేంద్ర‌ ప్రభుత్వానికి అభినంద‌న‌లు తెలిపిన విజయ్ మాల్యా.. కేంద్రానికి ఓ విజ్ఞప్తి చేశారు. తాను తీసుకున్న అప్పులన్నీ నూటికి నూరు శాతం తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదని తన ట్విట్టర్ ఖాతాలో వాపోయాడు. 
 
'కొవిడ్ -19 రిలీఫ్ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి నా అభినందనలు. వారు కావాలనుకుంటే ఎన్ని క‌రెన్సీ నోట్ల‌నైనా ముద్రించుకోగ‌ల‌రు. కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో తీసుకున్న‌ 100 శాతం రుణ బకాయిలు తిరిగి చెల్లిస్తానంటున్న‌ నాలాంటి చిన్న కంట్రిబ్యూట‌ర్ల‌ అభ్యర్థనల‌ను ప్రతిసారి పెడ‌చెవిన పెట్ట‌వ‌చ్చా? ఎలాంటి ష‌ర‌తులు లేకుండా నాకు ఇచ్చిన రుణ బ‌కాయిలు తిరిగి తీసుకుని, నాపై ఉన్న కేసులు మూసేయండి' అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
కాగా, దేశంలోని పలు బ్యాంకుల నుంచి 9 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా, వాటిని ఉద్దేశ్యపూర్వకంగా తిరిగి చెల్లించలేదు కదా, 2016లో దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం లండన్‌లో ఆశ్రయం పొందుతున్న ఈ టక్కరి మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. పైగా, ఆయన ఆస్తులన్నింటిని జప్తు చేస్తూ వస్తోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు