భారతీయ స్టేట్ బ్యాంకు సంచలన నిర్ణయం...

శుక్రవారం, 5 జనవరి 2018 (09:42 IST)
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయం ఖాతాదారులకు భారీ ఊరట కలిగించనుంది. కనీస నగదు నిల్వ విషయంలో ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండడంతో ఈ విషయాన్ని సమీక్షించాలని నిర్ణయించింది. పట్టణాల్లో రూ.3 వేలుగా ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను వెయ్యి రూపాయలకు తగ్గించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
 
గతేడాది జూన్‌లో ఎస్‌బీఐ కనీస నగదు నిల్వను రూ.5 వేలకు  పెంచింది. ఖాతాదారుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మెట్రో నగరాల్లో రూ.3 వేలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 కనీస నగదు నిల్వ ఉండాలంటూ ఆదేశాలు జారీచేసింది. అంతకుమించి తగ్గితే ఆయా ప్రాంతాలను బట్టి జరిమానా కింద రూ.25 నుంచి రూ.100 వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.
 
అదేసమయంలో గతేడాది ఏప్రిల్ - నవంబరు మధ్య కనీస నిల్వను పాటించని ఖాతాదారుల నుంచి రూ.1,772 కోట్లు వసూలు చేసినట్టు తాజాగా ఎస్‌బీఐ ప్రకటించింది. దీనిపై తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. లిక్కర్ డాన్ విజయ్ మాల్యా వంటి బడా పారిశ్రామికవేత్తలకు రూ.లక్షల కోట్లు రుణాలు ఇచ్చి.. వాటిని తిరిగి వసూలు చేసుకోలేని ఎస్.బి.ఐ యాజమాన్యం అపరాధం పేరుతో పేద ప్రజల నడ్డివిరుస్తోందంటూ ఘాటైన విమర్శలు వచ్చాయి. 
 
ఇదే విషయంపై ఎస్.బి.ఐను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు సోషల్ మీడియాలో నానా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో కనీస నిల్వ మొత్తాన్ని తగ్గించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి మొదలైంది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను రూ.1000కి తగ్గించాలని నిర్ణయించింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు